కాంగ్రెస్ పార్టీ మహిళా వ్యతిరేక మనస్తత్వానికి నిదర్శనం

టాలీవుడ్‌ స్టార్‌ నటి సమంత వ్యక్తిగత జీవితంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. నాగచైతన్య, సమంత విడాకులపై కొండా సురేఖ మాట్లాడిన తీరు.. అక్కినేని కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు సినీ ఇండ‌స్ట్రీతోపాటు రాజకీయ వర్గాల్లో తీవ్ర దూమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖల‌పై ఇప్పటికే సమంతకు నాగార్జున‌కు పలువురు మద్దతుగా నిలిచారు. తాజాగా మహిళా మంత్రి వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌  తీవ్రంగా స్పందించారు.పలువురు సినీ ప్రముఖులపై తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వంలోని ఓ మహిళా మంత్రి చేసిన వ్యాఖ్యలు దిగ్భ్రాంతిని కలిగించాయని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ మహిళా వ్యతిరేక మనస్తత్వానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ పెట్టారు. ‘సినీ ప్రముఖులను దూషిస్తూ తెలంగాణ ప్రభుత్వంలోని ఓ మహిళా మంత్రి చేసిన వ్యాఖ్యలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. మన దేశానికి ఎంతో గర్వకారణమైన వినోద పరిశ్రమను కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చూపించే ప్రయత్నాలు చేస్తోందో ఈ మాటలను బట్టి అర్థమవుతోంది. అంతేకాదు, మంత్రి మాటలు కాంగ్రెస్‌ మహిళా వ్యతిరేక మనస్తత్వాన్ని సూచిస్తున్నాయి. మన సమాజంలో ఇలాంటి విమర్శలకు స్థానం లేదు. ఈ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీతో పాటు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మౌనం వహిస్తోంది. వారి మౌనం వెనుక ఆమె వ్యాఖ్యలకు మద్దతు ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది’ అని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు.