తమ్మడపల్లిలో డ్రోన్ కలకలం.. భయభ్రాంతుల్లో గ్రామస్తులు

మర్రిగూడ, మే 20 (జనం సాక్షి): మర్రిగూడ మండలం తమ్మడపల్లి గ్రామంలో సోమవారం రాత్రి ఓ డ్రోన్ తక్కువ ఎత్తులో ఎగురుతూ కలకలం రేపింది.ఎరుపు, తెలుపు రంగుల లైట్లతో మిణుకుమంటూ గ్రామంపై చక్కర్లు కొట్టిన డ్రోన్‌ను చూసి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఇది సర్వే కోసమా లేక మరేదైనా కారణంతో ఎగురుతోందా అనే విషయం తెలియక గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.ఇలాంటి డ్రోన్ సర్వేలు నిర్వహించే ముందు స్థానిక అధికారులకు, పోలీసులకు కనీస సమాచారం ఉండాలని, ప్రజల్లో ఏర్పడిన ఆందోళనను తొలగించేందుకు అధికారులు వెంటనే వివరణ ఇవ్వాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా రాత్రిపూట తక్కువ ఎత్తులో డ్రోన్ ఎగరడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.”రాత్రి పూట ఇంటి పైకప్పుల మీదుగా డ్రోన్ తిరుగుతుంటే భయం వేస్తోంది. ఇది దేనికి సంబంధించినదో అధికారులు చెప్పాలి” అని స్థానికులు కోరుతున్నారు. అధికారుల స్పందన తెలియాల్సి ఉంది.