
హనీమూన్ కోసం ఇండోర్ నుంచి మేఘాలయ వెళ్లి అక్కడ హత్యకు గురైన రాజా రఘువంశీ కేసులో ఆయన తల్లి ఉమా రఘువంశీ సంచలన ఆరోపణలు చేశారు. ఈ హత్య వెనుక తన కోడలు సోనమ్ హస్తం ఉందని, ఆమె కిరాయి హంతకులతో తన కుమారుడిని చంపించిందని ఆరోపించారు. ఒకవేళ తన కోడలు దోషిగా తేలితే, ఆమెకు మరణశిక్ష విధించాలని ఆమె డిమాండ్ చేశారు.ఇటీవల వివాహం చేసుకున్న రాజా రఘువంశీ, తన భార్య సోనమ్తో కలిసి హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లారు. అక్కడే రాజా అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన రాజా తల్లి ఉమా రఘువంశీ, ఇండియా టుడే టీవీతో మాట్లాడుతూ తన కోడలు సోనమ్పై తీవ్ర ఆరోపణలు చేశారు. తన కుమారుడికి అసలు ఆ ట్రిప్కు వెళ్లడం ఇష్టం లేదని, సోనమ్ తమ కుటుంబ సభ్యులకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండానే ఏకపక్షంగా ఫ్లైట్ టికెట్లు బుక్ చేసిందని ఆమె తెలిపారు. “వాడికి (రాజాకు) ఆ ట్రిప్కు వెళ్లాలని లేదు. మా కుటుంబానికి చెప్పకుండానే సోనమ్ ఫ్లైట్ టికెట్లు బుక్ చేసింది. ఒకవేళ ఆమె ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటే, ఆమెకు కచ్చితంగా మరణశిక్ష విధించాలి” అని ఉమా రఘువంశీ డిమాండ్ చేశారు. తన కుమారుడిని సోనమ్ బలవంతంగానే మేఘాలయకు తీసుకెళ్లిందని, అక్కడ పక్కా ప్రణాళికతో హత్య చేయించిందని ఆమె ఆరోపించారు. ఈ ఆరోపణలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పోలీసులు ఈ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.