మా సైనిక స్థావారాలపై భారత్‌ మెరుపుదాడులు


` అత్యాధునిక బ్రహ్మోస్‌ క్షిపణులతో విరుచుకుపడిరది
` మాకు ప్రతిస్పందించే సమయం కూడా ఇవ్వలేదు
` పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌
ఇస్లామాబాద్‌(జనంసాక్షి):ఆపరేషన్‌ సిందూర్‌లో పాకిస్థాన్‌, పీవోకేలో దాడులు చేసిన భారత సైన్యం.. అనేక ఉగ్ర, సైనిక స్థావరాలను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.
ఈ దాడులు జరిగిన విషయాన్ని పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ అంగీకరించారు. పాక్‌ సైన్యం మేల్కొనేలోపే కీలక సైనిక స్థావరాలే లక్ష్యంగా బ్రహ్మోస్‌ క్షిపణులతో భారత్‌ మెరుపు దాడులు చేసిందన్నారు. వాస్తవానికి మే 10వ తేదీ తెల్లవారుజామున భారత్‌పై దాడులు చేసేందుకు తమ సైన్యం సిద్ధమైందని, అంతలోపే భారత క్షిపణులు తమ స్థావరాలపై విరుచుకుపడ్డాయన్నారు. ‘’భారత్‌ దాడులను దీటుగా తిప్పికొట్టాలని మే 9వ తేదీ రాత్రి మేం నిర్ణయించుకున్నాం. 10వ తేదీ తెల్లవారుజామున ప్రార్థనలు ముగిసిన వెంటనే.. 4.30 గంటలకు దాడులు చేసేందుకు మా సైన్యం సిద్ధమైంది. కానీ, మా ప్రణాళిక అమలుకు కొన్ని గంటల ముందే బ్రహ్మోస్‌ క్షిపణులతో భారత్‌ విరుచుకుపడిరది. రావల్పిండి ఎయిర్‌పోర్టు సహా అనేక కీలకప్రాంతాలే లక్ష్యంగా దాడులు చేసింది’’ అని ప్రధాని షరీఫ్‌ పేర్కొన్నారు. అజర్‌బైజాన్‌ పర్యటనలో భాగంగా ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. దాడుల ప్రణాళిక గురించి ఆర్మీ చీఫ్‌ మునీర్‌ తనకు ముందస్తుగానే తెలియజేశారని అన్నారు.భారత దూకుడుతత్వం ఘర్షణను మరింత పెంచిందని ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ పేర్కొన్నారు. భారత్‌ దాడి చేసినప్పుడు దేశాన్ని రక్షించుకోవడం తప్పితే తమకు మరో మార్గం లేదన్నారు. కాల్పుల విరమణకు ఆర్మీ చీఫ్‌ మునీర్‌ సలహా ఇచ్చారని, ఈ ఘర్షణ మరింత ముదరకూడదనే ఉద్దేశంతో తాను కూడా అందుకు అంగీకరించానని చెప్పారు. ఇదిలాఉంటే, పాక్‌ సైన్యం హెడ్‌క్వార్టర్‌ ఉన్న రావల్పిండిలోని నూర్‌ఖాన్‌, చక్వాల్‌లోని మురీద్‌, జాంగ్‌ జిల్లా షోర్కోట్‌లో ఉన్న రఫీకి వైమానిక స్థావరాలతోపాటు ఇతర ప్రావిన్సుల్లో భారత్‌ దాడులు చేసింది. దీంతో దిగివచ్చిన దాయాది దేశం.. కాల్పుల విరమణను ప్రతిపాదించింది. ఇందుకు సానుకూలంగా స్పందించిన భారత్‌.. డీజీఎంవో స్థాయి అధికారుల చర్చల అనంతరం కాల్పుల విరమణకు ఇరుదేశాలు అంగీకరించాయి.

 

తాజావార్తలు