జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ కన్నుమూత

` ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం ఆగిన తుదిశ్వాస
` జూబ్లీహిల్స్‌ ప్రజల తలలో నాలుకగా ఉండేవారు: కిషన్‌రెడ్డి
` భౌతిక కాయానికి నివాళులర్పించిన సీఎం రేవంత్‌, భారాస అధినేత కేసీఆర్‌
హైదరాబాద్‌(జనంసాక్షి): భారాసకు చెందిన జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ (62) కన్నుమూశారు. ఈనెల 5న (గురువారం) ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్చించారు.అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 5.45 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు వైద్యులు వెల్లడిరచారు.ఈనెల 5న ఇంట్లో ఉండగా ఆయనకు గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు ఏఐజీకి తరలించారు. కార్డియాక్‌ అరెస్టుకు గురైనట్లు వైద్యులు తెలిపారు. సీపీఆర్‌ చేయడంతో తిరిగి గుండె కొట్టుకోవడం, నాడి, బీపీ సాధారణ స్థితికి రావడంతో… ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగించారు. కొన్నాళ్లుగా ఆయన కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. మూడు నెలల క్రితం కూడా ఏఐజీలో చేరారు. అప్పట్లో డయాలసిస్‌ చేయించుకున్నట్లు సమాచారం. తాజాగా గుండెపోటు రావడంతో చికిత్స పొందుతూ మృతిచెందారు.
మూడు సార్లు ఎమ్మెల్యేగా..
తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ స్ఫూర్తితో మాగంటి గోపీనాథ్‌ 1982లో తెదేపాలో చేరారు. 1985లో హైదరాబాద్‌ నగర తెలుగు యువత అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఎన్టీఆర్‌ స్వయంగా ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. 2014లో తొలిసారి తెదేపా నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2018లో తెరాస (ప్రస్తుతం భారాస)లో చేరారు. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లోనూ విజయం సాధించారు. అనంతరం 2023లో జరిగిన ఎన్నికల్లోనూ గెలిచారు. వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందారు. 2022లో భారాస హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షుడిగానూ మాగంటి గోపీనాథ్‌ పనిచేశారు. జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ మృతి పట్ల భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం భారాసకు తీరని లోటు అని అన్నారు.గోపీనాథ్‌ ఎంతో కష్టపడి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారని పేర్కొన్నారు. సౌమ్యుడైన ప్రజానేతగా పేరు సంపాదించారన్నారు. మాగంటి కుటుంబం, అభిమానులకు కేసీఆర్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాగంటి గోపీనాథ్‌ మృతి పట్ల భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ మాజీ మంత్రి హరీశ్‌రావు సంతాపం తెలిపారు. ఆయన అకాల మరణం తీవ్రంగా కలచివేసిందని కేటీఆర్‌ అన్నారు. గోపీనాథ్‌ను కోల్పోవడం భారాసకు తీరని లోటు అని పేర్కొన్నారు. 3 సార్లు ఎమ్మెల్యేగా జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారన్నారు. మరోవైపు ఏఐజీ ఆస్పత్రికి కేటీఆర్‌, హరీశ్‌రావు వెళ్లారు. గోపీనాథ్‌ భౌతికకాయానికి నివాళులర్పించారు. ఎమ్మెల్యే మృతి నేపథ్యంలో నల్గొండ, ఖమ్మం జిల్లాల పర్యటనను కేటీఆర్‌ రద్దు చేసుకున్నారు.మాగంటి గోపీనాథ్‌ మృతి పట్ల కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన అకాల మరణం బాధాకరమన్నారు. గోపీనాథ్‌.. జూబ్లీహిల్స్‌ ప్రజల తలలో నాలుకగా ఉండేవారన్నారు. ఆయన కుటుంబసభ్యులు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మాగంటి గోపీనాథ్‌ భౌతికకాయానికి సీఎం రేవంత్‌, కేసీఆర్‌ నివాళులు
ఆదివారం ఉదయం కన్నుమూసిన భారాస ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ భౌతికకాయానికి సీఎం రేవంత్‌ రెడ్డి,, భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ నివాళులర్పించారు. మాదాపూర్‌లోని ఎమ్మెల్యే నివాసానికి చేరుకుని అంజలి ఘటించారు. గోపీనాథ్‌ పార్థివదేహాన్ని చూసి కేసీఆర్‌ కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం ఆయన కుటుంబసభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

తాజావార్తలు