ఘనంగా మహ్మద్ పీర్ బాబాన్ షా వలీ (ర.హ) దాదా హజాత్ ఉర్సు ఉత్సవాలు

పుల్కల్ : కుల మతాలకతీతంగా ఉర్సు ఉత్సవలలో భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొంటారని దర్గా పీఠాధిపతి మహమ్మద్ అబిద్ హుస్సేన్ సత్తారుల్ ఖాద్రి సాహెబ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం పరిధిలోని సింగూర్ గ్రామంలోని దర్గా వద్ద గత రెండు రోజుల గా హజారత్ మహమ్మద్ బాబాన్ షా వలీ (ర.హ) దాదా హజాద్ ఉర్సు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో వివిధ జిల్లాల నుండి భక్తులు భారీ సంఖ్యలో చేరుకొని పూజలు చేశారు. మంగళవారం సాయంత్రం పీఠాధిపతి ఇంటి నుండి గంధం (సందల్) ఒంటెలు, గుర్రాలపైన ఉంచి, పీఠాధిపతిని గుర్రంపై కూర్చోబెట్టి బ్యాండ్ మేళాలతో గ్రామ పురవీధుల గుండా శోభయాత్ర నిర్వహించారు. భక్తులతో కలసి ఆయన దర్గా వద్దకు చేరుకొని గంధం సందల్, రోజ్ వాటర్, గులాబీ పువ్వులతో దర్గా వద్ద ప్రత్యేక పూజలు చేశారు. మంగళవారం సాయంత్రం యువకులకు వాలీబాల్ పోటీలు నిర్వహించగా 12 టీములు పాల్గొన్నాయి. దీనిలో విజేతలుగా నిలిచిన ప్రథమ బహుమతి మునిపల్లి మణి టీం, ద్వితీయ బహుమతి సింగూర్ హాస్టల్ టీంలకు ఆయన చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా అన్న సాగర్ పీఠాధిపతి హజ్రత్ సూఫీ షా మహమ్మద్ ఖలీల్ హుస్సేన్ ఉర్ఫ్ జాహిద్ హుస్సేన్ ఖాద్రీ సత్తార్ సాహెబ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ గౌస్, ముఖారాం షా నక్ష్ బంధి సాహెబ్, సయ్యద్ జహంగీర్ (నాథ్ ఖా), సూఫీ మహమ్మద్ జమీర్ సత్తరి ఖాద్రి, ఫక్రుద్దీన్, సయ్యద్ అజ్మత్, సయ్యద్ ఖయ్యూం ఖాద్రి, నసీరుద్దీన్, షాహేద్, నఖీబ్ తదితరులు పాల్గొన్నారు.