ఢిల్లీని కప్పేసిన పొగమంచు

డిసెంబర్ 18 (జనం సాక్షి): కాలుష్య కాసారంగా మారిన ఢిల్లీలో దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఎదురుగా ఉన్నవారు కూడా కనిపించని పరిస్థితి ఏర్పడింది. దీంతో నగరంలోని చాలా ప్రాంతాల్లో ప్రజలు ఇండ్ల నుంచి కూడా బయటకు రాలేకపోతున్నారు. మంచు దుప్పటి కప్పేయడంతో రవాణా రంగంపై తీవ్ర ప్రభావం పడింది. ఇందిరాగాంధీ విమానాశ్రయంలో సుమారు 40 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. అదేవిధంగా 22కు పైగా రైళ్లు ఆలస్యమయ్యాయి
ఫ్లైట్ ఆపరేషన్స్ ప్రస్తుతం సీఏటీ 3 కండీషన్స్లో ఉన్నాయని, ఈ నేపథ్యంలో విమాన రాకపోకపోకలు ఆలస్యమవడం లేదా రద్దవడం వంటివి జరగవచ్చని విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపారు. ప్రయాణికులు తాము వెళ్లాల్సిన విమానాల సమయాలను గురించి ఎప్పటికప్పుడు సంబంధిత ఎయిర్లైన్స్తో కాంటాక్ట్లో ఉండాలని సూచించారు.
ఇక రాజధానిలో చాలా ప్రాంతాల్లో దృశ్యమానత తగ్గిపోవడంతో రహదారుల వెంబడి వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఢిల్లీని ఎన్సీఆర్ పరిధిలోని ప్రాంతాలతో కలిపి హైవేలపై కూడా ఇదే పరిస్థితి నెలకొన్నది. కాగా, కాలుష్యం నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గ్రూప్ కింద అత్యంత కఠినమైన కాలుష్య నియంత్రణలు అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో ఒకటి నుంచి ఐదో తరగతుల విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు. మిగిలినవారికి హైబ్రీడ్ మోడ్లో క్లాసుల జరుగనున్నాయి.


