తండ్రిని కడతేర్చిన కుమారుడు

 

 

 

 

 

 

 

 

 

పాపన్నపేట, జనవరి 6 (జనంసాక్షి) :

డబ్బుకోసం .. ఘర్షణ

డబ్బు కోసం తండ్రిని ఓ కొడుకు హత్య చేసిన సంఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధి లోని సీతానగర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం .. సీతానగర్ గ్రామానికి చెందిన లంగాడి లక్ష్మయ్య (48) వ్యవసాయంతో పాటు ఓ లైన్ మెన్ వద్ద విద్యుత్ పనుల కోసం ప్రైవేటు సహాయకుడిగా పని చేస్తున్నాడు. ఇతనికి భార్య శేఖమ్మతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కొడుకు శ్రీకాంత్ వివాహానికి, వ్యవసాయానికి కొంత అప్పులు అయ్యాయి. పెద్ద కొడుకు శ్రీకాంత్ కు లక్ష్మయ్యకు తరచూ డబ్బుల కోసం గొడవ జరిగేది. డబ్బులు ఇవ్వకపోతే చంపుతా అంటూ తరచూ శ్రీకాంత్ తండ్రిని బెదిరించేవాడు. సోమవారం రాత్రి లక్ష్మయ్య ఇంటికి రాగానే శ్రీకాంత్ మళ్లీ డబ్బులు అడగడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. శ్రీకాంత్ ఆవేశంలో ముందుగా సుత్తేతో తండ్రిపై దాడి చేయగా తల్లి శేఖమ్మ అతని వద్ద నుంచి సుత్తిని లాక్కోవడంతో శ్రీకాంత్ మళ్లీ అక్కడే ఉన్న కర్రతో లక్ష్మయ్య తలపై దాడి చేయడంతో తీవ్ర గాయమైంది. వెంటనే కుటుంబీకులు మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించగా అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు.
తన భర్త మృతికి కారణమైన కొడుకు శ్రీకాంత్ పై చర్యలు తీసుకోవాలని మృతుడి భార్య శేఖమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.