ఎస్సై తీరుపై ఆందోళన

వరికుంటపాడు: నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండల ఎస్సై ఎస్‌. శ్రీనివాసరావు తీరును నిరసిస్తూ గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. మండలంలోని గువ్వాడి గ్రామానికి చెందిన అంగన్‌వాడీ టీచర్‌ విజయలక్ష్మీ అదే గ్రామానికి చెందిన రమణయ్య మద్యం సేవించి తనను తిట్టినట్టు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో బుధవారం రమణయ్యను విచారణ నిమిత్తం పోలీసుస్టేషన్‌కు తీసుకు వచ్చారు. అయితే రమణయ్యను ఎస్సై ఎస్‌. శ్రీనివాస్‌రావు విచక్షణారహితంగా కొట్టాడని ఆరోపిస్తూ గురువారం దాదాపు 200 మంది ప్రజలు స్టేషన్‌ ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో కనిగిరి-బద్వేలు రోడ్డుపై గంటపాటు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. సంఘటనాస్థలానికి సీఐ కల్యాణ్‌రాజ్‌ చేరుకొని దీనిపై విచారణ జరిపి ఎస్సైపై చర్యలు తీసుకుంటామన్నారు. దీంతో ప్రజలు ఆందోళన విరమించారు.