కపిల్‌దేవ్‌కు బీసీసీఐ క్షమాభిక్ష

కోటి రూపాయల వన్‌టైమ్‌ బెనిఫిట్‌ ప్రకటించిన బోర్డు
ముంబై, జూలై 25 : భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ కపిల్‌దేవ్‌ను బీసీసీఐ మన్నించింది. అతన్ని తిరిగి బోర్డులోకి చేర్చుకుంటున్నట్టు ఇవాళ అధికారికంగా ప్రకటించింది. ఐసీఎల్‌కు రాజీనామా చేసినట్టు ఇటీవలే చెప్పిన కపిల్‌దేవ్‌ బీసీసీఐ సంబంధాల పునరుద్ధరణ కోసం తీవ్రంగా ప్రయత్నించాడు. 2007లో బీసీసీఐ వ్యతిరేకంగా ప్రారంభమైన ఇండియన్‌ క్రికెట్‌ లీగ్‌లో కపిల్‌దేవ్‌ డైరక్టర్‌గా వ్యవహరించాడు. ప్రపంచవ్యాప్తంగా పలువురు స్టార్‌ క్రికెటర్లతో పాటు భారత దేశవాళీ క్రికెటర్లు కూడా దీనిలో చేరడంతో మంచి క్రేజ్‌ వచ్చింది. అయితే ఐసీఎల్‌లో చేరిన కపిల్‌దేవ్‌, కిరణ్‌మోరేలతోపాటు అందులో ఆడిన ఆటగాళ్ళపై బోర్డు నిషేదం వేటువేసింది. తర్వాత 2008లో ఐపీఎల్‌ ప్రారంభమవడంతో క్రమంగా ఐసీఎల్‌ కనుమరుగైంది. అయినప్పటికీ బోర్డుతో మాత్రం కపిల్‌దేవ్‌కు సరైన సంబంధాలు లేవు. ఇటీవల ఐసీఎల్‌ ఐదో సీజన్‌ సందర్భంగా మాజీ క్రికెటర్లను గౌరవిస్తూ లీగ్‌లోకి వచ్చిన లాభాలను వారికి పంచింది. దీనిలో కపిల్‌దేవ్‌ పేరులేకపోవడంతో విమర్శలు కూడా వచ్చినప్పటికీ బీసీసీఐ మాత్రం పట్టించుకోలేదు. తాజాగా ఐసీఎల్‌లో చేరిన కిరణ్‌మోరే బోర్డుకు క్షమాపణలు చెబుతూ రాసిన లేఖను బీసీసీఐ వర్కింగ్‌ కమిటీ ఆమోదించింది. వెంటనే వన్‌టైమ్‌ బెనిఫిట్‌ లాభాలకు కూడా అతన్ని అర్హుడ్ని చేయడంతో కపిల్‌దేవ్‌ కూడా అదే బాటలో నడిచాడు. బీసీసీఐతో రాజీ పడేందుకు సిద్ధమయ్యాడు. ఇటీవల ఐసీఎల్‌కు రాజీనామా చేసిన లేఖను మీడియాకు చూపించాడు. తర్వాత బోర్డుకు కపిల్‌ ఒక లేఖ రాసినట్టు సమాచారం. ఐసీఎల్‌ నుంచి తాను బయటికొచ్చినట్టు, భవిష్యత్‌లో బీసీసీఐతోనే కొనసాగునున్నట్లు ఈ మాజీ సారథి లేఖలో పేర్కొన్నాడు. నిజానికి కపిల్‌దేవ్‌ రాజీ వెనుక బీసీసీఐ ప్రెసిడెంట్‌ శ్రీనివాసన్‌ పాత్ర ఉందని తెలుస్తోంది. ఆయన సలహాలతోనే కపిల్‌ దీనికి ఒప్పుకున్నట్టు బోర్డు వర్గాల సమాచారం. కపిల్‌దేవ్‌ లేఖను అందుకున్న బోర్డు వెంటనే దానికి ఆమోదం తెలిపింది. కపిల్‌ను తిరిగి బీసీసీఐలోకి ఆహ్వానిస్తున్నామని, అతని సేవలు వినియోగించుకుంటామని బోర్డ్‌ తన ప్రకటనలో తెలిపింది. దీనితో పాటు గతంలో అతనికి నిలిపివేసిన పలు బకాయిలను సైతం బీసీసీఐ నజరానా కూడా ప్రకటించింది. భారత క్రికెట్‌లో మాజీ క్రికెటర్లు ఆడిన మ్యాచ్‌ల ఆధారంగా బీసీసీఐ వన్‌టైమ్‌ బెనిఫిట్‌ స్కీం ప్రవేశపెట్టింది. 1983లో భారత్‌కు ప్రపంచకప్‌ అందించిన కపిల్‌దేవ్‌ ఇప్పటివరూ 131 టెస్టులు, 225 వన్డేలు ఆడాడు. అలాగే 275 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు కూడా ఆడాడు.