జర్దారీపై పునర్విచారణకు పాక్‌ అంగీకారం

ఇస్లామాబాద్‌,సెప్టెంబర్‌ 18(జనంసాక్షి):
పాకిస్తాన్‌ ప్రభుత్వం దిగివచ్చింది. అత్యున్నత న్యాయస్థానం హెచ్చరికలతో అధ్యక్షుడు అసిఫ్‌ అలీ జర్దారీపై కేసులు తిరగదోడేందుకు సిద్ధమైంది. జర్దారీ అవినీతి కేసుల వ్యవహారం లో కోర్టు ధిక్కరణ అభియోగాలు ఎదుర్కొం టున్న ప్రధాని రజా పర్వేజ్‌ అష్రాఫ్‌ మంగళ వారం సుప్రీంకోర్టు ఎదుట హాజరయ్యారు. జూన్‌ 22న ప్రధానిగా
బాధ్యతలు చేపట్టిన అష్రాఫ్‌ కోర్టుకు హాజరు కావడం ఇది రెండోసారి. జర్దారీపై అవినీతి కేసులను పునర్విచారించేందుకు అంగీకరిస్తున్నట్లు న్యాయస్థానానికి తెలిపారు. జర్దారీపై ఉన్న కేసులను మూసివేయాలని గతంలో స్విస్‌ అధికారులకు రాసిన లేఖను ఉపసంహరించుకుంటామని తెలిపారు. అలాగే, ఆయనపై కేసులను తిరగదోడాలని లేఖ రాస్తామని చెప్పారు. ఆయన వివరణతో సంతృప్తి చెందిన న్యాయస్థానం స్విస్‌ అధికారులకు లేఖ రాసేందుకు ఈ నెల 25 వరకు గడువిచ్చింది. కోర్టు ధిక్కరణ కేసులో తదుపరి విచారణనకు కూడా అదే రోజుకు వాయిదా వేసింది. ఆ రోజు కోర్టుకు ప్రధాని స్వయంగా హాజరు కావాల్సిన అవసరం లేదని తెలిపింది.