తెలంగాణపై సోనియా , ఆజాద్‌లు చర్చిస్తున్నారు : వాయలార్‌

న్యూఢిల్లీ, నవంబర్‌ 6 (జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి మార్పుపై అధిష్ఠానం వద్ద ఎలాంటి చర్చలు జరగలేదని కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల పరిశీలకుడు వాయలార్‌ రవి స్పష్టం చేశారు. మంగళవారం నాడు ఆయన మీడియా తో మాట్లాడారు. 2014 ఎన్నికల వరకు కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగు తారని ఆయనకు ఎలాంటి డొకాలేదని చెప్పారు. ముఖ్యమంత్రిని మారుస్తారని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ఆయనను మార్చే ప్రసక్తే లేదని చెప్పారు. కిరణ్‌ను మార్చాల్సిన అవసరం ఏ మాత్రం లేదని, కిరణ్‌కుమార్‌రెడ్డి బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. తెలంగాణపై ఎవరి అభిప్రాయాలు వారు చెబుతున్నారని వాయలార్‌ రవి అన్నారు. అందరి అభిప్రాయాలను తాను తీసుకొని తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి చేరవేస్తున్నానని చెప్పారు. తెలంగాణపై తుది నిర్ణయం తీసుకోవాల్సింది సోనియా గాంధీయేనని చెప్పారు. తమను తెలంగాణ ప్రాంత నేతలు పలువురు కలిశారని, ఎవరూ ముఖ్యమంత్రి మార్పుపైన చర్చించలేదని, కేవలం తెలంగాణను పరిష్కరించాలని మాత్రమే కోరారని తెలిపారు. కాగా ఇటీవల కిరణ్‌కుమార్‌రెడ్డిని మార్చి ఆయన స్థానంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన నేతలు… మర్రి శశిధర్‌రెడ్డి, కుందూరు జానారెడ్డి లేదా డి.శ్రీనివాస్‌ను కూర్చోబెడతారనే వార్తలు వచ్చాయి. నవంబర్‌ 9వ తేదీలోగా కిరణ్‌ మార్పు ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వాయలార్‌ రవి మాటలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రెండు రోజుల క్రితం న్యూఢిల్లీలో జరిగిన కాంగ్రెస్‌ ప్రజా సభకు వెళ్లిన రాష్ట్ర నేతలు పలువురు ఆ సభ ముగిసిన తర్వాత కూడా అక్కడే మకాం వేశారు. సోమవారం సోనియా గాంధీ సహా పలువురు పార్టీ పెద్దలను కలిసి తెలంగాణపై తేల్చాలని, ముఖ్యమంత్రి మార్పు అవసరం లేదని చెప్పినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.