రైతుల దుస్థితికి కాంగ్రెస్సే కారణం: కర్నె

హైదరాబాద్‌,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి ): రాష్ట్రంలోని రైతు ఆత్మహత్యలకు కాంగ్రెస్సే కారణమని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ ధ్వజమెత్తారు. వ్యవసాయాన్ని నాశనం చేసిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందన్నారు. 40 సంవత్సరాలుగా రైతులకు చేసిన అన్యాయానికి కాంగ్రెస్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. రైతులకు రుణమాఫీ చేసిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిది అని తెలిపారు. రైతులకు 24 గంటల కరెంట్‌ ఇస్తున్నామని పేర్కొన్నారు. ప్రాజెక్టులు కట్టాలని పోరాటాలు చేస్తారు కానీ కాంగ్రెస్‌ మాత్రం ప్రాజెక్టులు కట్టొద్దని అడ్డుపడుతోందని మండిపడ్డారు. రైతు వ్యవసాయం చేసుకోవద్దని కాంగ్రెస్‌ కుట్రలు చేస్తోందని అన్నారు. కోటి ఎకరాలు సస్యశ్యామలం కావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఉద్ఘాటించారు. సమైక్య పాలనలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొనే వారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వంలో ఉచిత కరెంట్‌, సాగునీటి సరఫరాతో రైతులు వ్యవసాయం ఇష్టంగా చేసుకుంటున్నారని తెలిపారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. తెలంగాణకు రావాల్సిన కృష్ణా జలాలను పోతిరెడ్డిపాడుకు తీసుకుపోతుంటే వ్యతిరేకించకుండా మంగళహారతులు పట్టారని ధ్వజమెత్తారు. రైతు బాగుపడాలనే ఆలోచన ఉంటే ప్రాజెక్టుల నిర్మాణానికి అడ్డు తగలకుండా ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. కాంగ్రెస్‌ నేతలను తెలంగాణ ప్రజలు క్షమించరు అని పేర్కొన్నారు.