సుమన్ కన్నుమూత
హైదరాబాద్: రచయితగా, దర్శకుడిగా,బహుముఖ సృజనశీలిగా బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితులైన సీహెచ్.సుమన్ గురువారం రాత్రి 12.18 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 45 సంవత్సరాలు. నాలుగైదేళ్లుగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన కొద్దినెలలుగా హైదారాబాద్లోని యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు రెండో కుమారుడైన సుమన్ 1966 డిసెంబర్ 23న జన్మించారు. ఉషోదయా ఎంటర్ప్రైజ్స్ మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఆయనకు ఒక పాప,ఒక బాబు. భార్య విజయేశ్వరి రామోజీ గ్రూపు సంస్థల్లో భాగమైన డాల్ఫిన్ హోటల్స్కు మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. సుమన్ అంత్యక్రియలు శుక్రవారం రామోజీ ఫిల్మ్సిటీలో నిర్వహించనున్నట్టు కుటుంబ వర్గాలు వెల్లడించాయి.