సెమీస్‌లో మేరీ కామ్‌ ఓటమి, భారత్‌కు నాలుగో పతకం

లండన్‌, ఆగస్టు 8 : భారత్‌ ఐరన్‌లెడీగా పేరుగాంచిన మహిళా బాక్సర్‌ మేరీకామ్‌ బుధవారం జరిగిన సెమీ ఫైనల్స్‌ బౌట్‌లో బ్రిటన్‌ బాక్సర్‌ నికోల్‌ ఆడమ్స్‌తో చేతిలో పరాజయం పాలైంది. 51కేజీల ఫ్లె వెయిట్‌లో పోటీపడుతున్న ఆమె రెండో సీడ్‌ ఆడమ్స్‌తో 11-6 పాయింట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో భారతచరిత్రలోనే కాంస్య పతకం అందుకున్న తొలి బాక్సర్‌గా మేరీ రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ఈ మ్యాచ్‌లో నికోల్‌ ఆడమ్స్‌ చేతిలో పరాజయం పాలైనప్పటికీ లండన్‌ ఒలింపిక్స్‌ నిబంధనల ప్రకారం మేరీకి కాంస్య పతకం దక్కింది.
దీంతో లండన్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ నాలుగు పతకాలు సాధించింది. ఇది మాత్రమే కాకుండా ఒలింపిక్‌ చరిత్రలో తొలిసారి భారత్‌ నాలుగు పతకాలను సొంతం చేసుకుంది. ఒలింపిక్స్‌లో తొలిసారి మహిళల బాక్సింగ్‌ పోటీలు జరుగుతున్న విషయం తెలిసిందే. మేరీకామ్‌ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించగా.. లండన్‌ ఒలింపిక్స్‌ మహిళల సింగిల్స్‌ బ్యాడ్మింటన్‌ విభాగంలో సైనా నెహ్వాల్‌ కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే.