అంతర్జాతీయ మెడికల్‌ హబ్‌గా హైదరాబాద్‌: మంత్రి హరీశ్‌ రావు

అంతర్జాతీయ మెడికల్‌ హబ్‌గా హైదరాబాద్‌: మంత్రి హరీశ్‌ రావు

హైదరాబాద్‌ మెడికల్‌ హబ్‌గా మారనున్నదని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ఇప్పటికే హైదరాబాద్‌ ఫార్మా హబ్‌గా, వ్యాక్సిన్‌ హబ్‌గా, ఐటీ హబ్‌గా కొనసాగుతున్నదని, అతి త్వరలోనే మెడికల్‌ హబ్‌గా మారుతుందని తెలిపారు. హైదరాబాద్‌లోని బయోడైవర్సిటీ సమీపంలో నెలకొల్పిన అరీట్‌ మల్టి స్పెషాలిటీ దవాఖానను ఆదివారం చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఇప్పటికే నగరానికి రాష్ట్రంతోపాటు ఇతర రాష్ర్టాలు, దేశాల నుంచి ప్రజలు వైద్య సేవల కోసం వస్తున్నారని చెప్పారు.కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ దవాఖానల్లో సేవలందించేలా రాష్ట్ర సర్కారు చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. రాష్ర్టానికి దేశ, విదేశాల నుంచి రోగులు వస్తుండటంతో మెడికల్‌ టూరిజం పెరుగుతున్నదని వెల్లడించారు. తద్వారా ఎంతో మందికి ఉపాధి లభిస్తున్నదని తెలిపారు. అరీట్‌ దవాఖాన యాజమాన్యం రోగులకు మెరుగైన వైద్య సేవలందించడంతోపాటు పేద, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో వైద్య సేవలందించేందుకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో దవాఖాన చైర్మన్‌ డాక్టర్‌ విజయేందర్‌రెడ్డి తీగల, మేనేజింగ్‌ డైరెక్టర్‌ గుత్తా, డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీకాంత్‌ వేముల తదితరులు పాల్గొన్నారు.