అంబేడ్కర్ విగ్రహం వద్ద వైకాపా నివాళి
విజయవాడ,నవంబర్26(జనం సాక్షి): అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పనిచేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా మంగళవారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అంబేద్కర్ విగ్రహానికి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, బొప్పన భవకుమార్, దేవినేని అవినాష్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ… సీఎం వైఎస్ జగన్ బడుగు, బలహీన వర్గాలకు నామినేటెడ్ పదవులు, పనులలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించారని పేర్కొన్నారు. నవరత్న పథకాల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. దళితులను చంద్రబాబు అనేక విధానాలుగా అవమానించారని విమర్శించారు. దళితులపై టీడీపీ నేతలు దాడులకు తెగబడ్డారని మండిపడ్డారు. దళితులుగా పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని చంద్రబాబు దళితులను హేళన చేశారన్నారు.