అజోల్లా పెంపకంతో బహుళ ప్రయోజనాలు

గరిడేపల్లి, జూన్ 13 (జనం సాక్షి):అజోల్లా నీటి మీద తేలుతూ పెరిగే ఫెర్న్ జాతికి చెందిన మొక్క ను పెంచు కోవడం ద్వార పచ్చి రొట్టగా జీవన ఎరువుగా పశువులకు కోళ్ళకు చేపలకు దాణాగా వాడుకోవచ్చునని కేవీకె ఇంఛార్జి ప్రోగ్రాం కోఆర్డినేటర్ బి. లవకుమార్ అన్నారు. సోమవారం కెవికే లో అజోల్లా పెంపకం పై రైతులకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించి అజోల్లా వాడకం వలన కలిగే వివిధ ప్రయోజనాల గురించి అవగాహన కల్పించినట్లు తెలియజేశారు. వరి పొలంలో దమ్ములో ఎకరాకు 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ను వేసి పలుచగా నీరుకట్టి 10 నుండి 20 కిలోల అజోల్లా ను వేసి 3 నుండి 4 వారాలు పెరగనిచ్చి నేలలో కలియదున్నడం ద్వారా ఎకరానికి 3 టన్నుల పచ్చి రొట్ట,12 కిలోల నత్రజని నేలకు చేరవేస్తుందనారు. తద్వారా నత్రజని వాడకాన్ని సగానికి తగ్గించుకోవచ్చునని అన్నారు. అజోల్లా ను  పశువుల దాణాగా వాడడం చాలా లాభదాయకంగా ఉంటుందని అన్నారు. ఎండిన అజోల్లా  పొడిలో 25 నుండి 30 శాతం మాంస కృత్తులు,10 నుండి 15 శాతం మినరల్స్, 7నుండి 10 శాతం అమినో ఆమ్లాలు మరియు కెరోటిన్, బి12 విటమిన్లు ఉంటాయని అదే విధంగా తక్కువగా లిగ్నిన్ ఉండడం వలన పశువులు తేలికగా జీర్ణం చేసుకొంటాయని  ముఖ్యంగా పాడి పశువులకు దాణాగా పెట్టినప్పుడు 15 నుండి 20 శాతం పల దిగుబడి పెరగడం తో పాటు వెన్న శాతం పెరుగుతుంది అని అన్నారు. గొర్రెలు, మేకలు, కోళ్ళు, చేపలు, కుందేళ్ళు వంటి వాటికి మేతగా ఉపయోగ పడుతుందని వివరించారు. అజోల్లా ను రైతులు వరి పొలంలో  ఇంటి పరిసరాల్లో సులభంగా పెంచుకోవచ్చునని అన్నారు. అజోల్లా ను జీవన ఎరువుగా కూడా మంచి ఫలితాలనిస్తుందని కావున దీనికి సేంద్రియ వ్యవసాయంలో ఎంతో ప్రాముఖ్యత పెరిగిందని కొద్ది జాగ్రత్తలతో అజోల్లా ఉత్పత్తిని చేపట్టి లబ్ది పొందవచ్చుని తెలిపారు.ఈ శిక్షణలో   డి.ఆదర్శ్ శాస్త్రవేత్త ,  వివిధ గ్రామాలకు చెందిన 30 మంది రైతులు పాల్గొన్నారు.
Attachments area