అడుగడుగునా విపక్షాల అడ్డంకులు

రైతు సంక్షేమాన్ని దెబ్బతీసే కుట్రలు
కాంగ్రెస్‌కు పరాభవం తప్పదు: కర్నె
నల్లగొండ,అక్టోబర్‌7 జనం సాక్షి : కోటి ఎకరాల తెలంగాణ మాగాణాన్ని సాధించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న క్రమంలో అడుగడుగునా విపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీ వారు అడ్డంకులు సృష్టిస్తూనే ఉన్నారని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌  అన్నారు. ఈ లక్ష్యసాధనలో వెనుకంజ వేసే ప్రసక్తి లేదన్నారు. హుజూర్‌నగర్‌తో ఇక కాంగ్రెస్‌కు సమాధి తప్పదన్నారు. ఆర్టీసీ సమ్మెలపై కాంగ్రెస్‌ మొసలి కన్నీరు మానుకోవాలన్నారు. సంస్థను భ్రష్టుపట్టించిందే వారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకోవాలని కాంగ్రెస,టిడిపిలు ముందు నుంచి కుట్ర చేస్తున్నాయని అన్నారు. ఇప్పుడు ఎన్నికల్లో జట్టుకట్టి విషప్రచారం చేస్తున్నాయని  అన్నారు. అయినా ఇందులో అడ్డంకులు తాత్కాలికమేనని అన్నారు. అన్నదాతల ముఖాల్లో నవ్వులు చూడడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని, అందుకోసమే అనేక కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. అందులో భాగంగానే రైతుల అభివృద్ధి కోసం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని తెలిపారు.అన్నదాతలకు సంఘటితం చేసి వారిని ఆర్థికంగా బాగుచేయాలని ఉద్దేశంతో ప్రభుత్వం రైతు సమితులను ఏర్పాటు చేసిందన్నారు. రైతులకు ప్రయోజనం కలిగించేందుకు 24గంటల కరెంట్‌ ఇస్తోందని అన్నారు. కాళేశ్వరం పూర్తయితే గోదావరి జలాలను నిరంతరంగా వాడుకోవడం, మిషన్‌ భగీరథ ద్వారా అన్ని ప్రాంతాలకు నీరు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. అయితే కాంగ్రెస్‌ వారు దీనిని అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. సీఎం కేసీఆర్‌ నిర్ణయంతో మరో రెండు, మూడేళ్లలో రైతులు అప్పులిచ్చే స్థాయికి ఎదుగుతారని చెప్పారు. గత ప్రభుత్వాలు రైతులను పట్టించుకోలేదన్నారు. ఎరువులు, విత్తనాల కోసం అన్నదాతలు లాఠీ దెబ్బలు తిన్నారని మంత్రి గుర్తు చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుల కోసం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. సీజన్‌కు ముందుగానే ఎరువులు, విత్తనాలతో పాటు రైతులు పండించిన పంటలను నిల్వ ఉంచేందుకు భారీ గోదాంలను సైతం నిర్మించామన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేశామన్నారు. ఆరుగాలం పండించిన పంటలను అమ్ముకొని రైతు కష్టాల్లో సుఖ సంతోషాలను చూడడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఎన్నికల్లో లేని హావిూలను సైతం రాష్ట్ర ప్రభుత్వం అమలు పరిచిందన్నారు. ముఖ్యంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, పింఛన్లు, రైతుబంధు, రైతు బీమాలాంటి పథకాలు అమలు పరుస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ టిఆర్‌ఎస్‌ నేతను దీవించి హుజూర్‌నగర్‌లో గెలిపించాలన్నారు. అప్పుడే కాంగ్రెస్‌కు బుద్ది వస్తుందన్నారు.