అతడు డ్రిల్‌ మాస్టరే కాదట..! – ఎన్డీఎంఏ

– కోయంబత్తూరు విషాధ ఘటనపై విచారణ
– ట్రైనర్‌ ఆర్ముగును అదుపులోకి తీసుకున్న పోలీసులు
చెన్నై, జులై13(జ‌నం సాక్షి) : క్‌ డ్రిల్‌ పేరుతో 19 ఏళ్ల బాలికను పొట్టనబెట్టుకున్న ట్రైనర్‌ ఆర్ముగం గురించి షాకింగ్‌ విషయాలు బయటికి వచ్చాయి. చెన్నైలోని కోవై కళైమగల్‌ కళాశాలలో ఎన్‌డీఎంఏ(నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ) మాక్‌ డ్రిల్‌ నిర్వహించిందని తనను ట్రైనర్‌గా పంపించారని చెప్పి ఆర్ముగం కళాశాలలోకి వెళ్లాడు. యాజమాన్యం కూడా అతను చెప్పిన మాటల్ని నమ్మి విద్యార్థులతో మాక్‌ డ్రిల్‌ చేయించింది. ఈ విషయం గురించి తాజాగా ఎన్‌డీఎంఏ ట్విటర్‌ ద్వారా స్పందించింది. విద్యార్థిని మృతిపట్ల తాము చింతిస్తున్నట్లు తెలిపింది. అయితే ఆ కళాశాలలో నిర్వహించిన డ్రిల్‌కు, తమకూ ఎలాంటి సంబంధం లేదని అంటోంది. ‘మాక్‌ డ్రిల్‌ సమయంలో ఓ విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. ఆమె కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఎన్‌డీఎంఏ ఆ కళాశాలలో అధికారికంగా ఎలాంటి మాక్‌ డ్రిల్‌ను నిర్వహించలేదు. ఆర్ముగం ఎన్‌డీఎంఏ అధికారికంగా గుర్తించిన శిక్షకుడు కాదు. మాక్‌ డ్రిల్‌ నిర్వహించమని అతడిని మేము పంపలేదు’ అని వెల్లడించింది. దాంతో అసలు ఆర్ముగం ఎవరు? అన్న సందేహాలు మొదలవుతున్నాయి. ఈ కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఆర్ముగం ఫేస్‌బుక్‌ ఖాతాను పరిశీలించగా, తనని తాను ఎన్‌డీఎంఏ ట్రైనర్‌గా పేర్కొనడం గమనార్హం. కోయంబత్తూరు జిల్లా నర్సీపురంలోని కోవై కలైమగల్‌ కాలేజీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో అగ్ని ప్రమాద సమయంలో ఎలా వ్యవహరించాలన్న దానిపై అధికారులు మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. చెన్నైకి చెందిన  ఫైర్‌ సేఫ్టీ బృందం.. సుమారు 20 మంది స్టూడెంట్లను ఎంపిక చేసి 40 రోజులుగా శిక్షణ కూడా ఇచ్చారు. గురువారం మధ్యాహ్నాంతో విద్యార్థులను ఒక్కోక్కరికిగా రెండో అంతస్థు నుంచి కిందకు దూకించగా.. కింద విద్యార్థులు వల సాయంతో వారిని రక్షిస్తూ వచ్చారు. ఈ క్రమంలో లోగేశ్వరి(19) అనే బీబీఏ స్టూడెంట్‌ను సహాయక సిబ్బంది కిందకు తోశాడు. అయితే ఆ విద్యార్థిని అప్రమత్తంగా లేకపోవటంతో.. కింద ఫ్లోర్‌ సెల్ఫ్‌కు తలబలంగా తాకి కుప్పకూలిపోయింది. ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. లోగేశ్వరి స్వస్థలం అలందూరి. ఘటన గురించి సమాచారం అందుకున్న తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకుని బోరున విలపించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి లోగేశ్వరి మరణానికి కారణమయ్యాడంటూ ట్రైనర్‌ అర్ముగంను అదుపులోకి తీసుకుని పోలీసులు రిమాండ్‌కు తరలించారు.