అధికారం కాదు ప్రజల సమస్యలు తీర్చాలి..

కష్టాల్లో ఉన్నవారికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది.
– హామీలకే పరిమితమైన డబల్ బెడ్ రూమ్ ఇండ్లు.
– అధికారం అడ్డం పెట్టుకుని భూకబ్జాలు చేయడం నేరం.
– ఊరుకొండ మండలం పై ఎమ్మెల్యేకు చిన్నచూపు ఎందుకు..
– కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త జనంపల్లి అనిరుద్ రెడ్డి.
ఊరుకొండ, సెప్టెంబర్ 17 (జనం సాక్షి):
అధికారం మీద ఉన్న వ్యామోహం.. ప్రజల సమస్యలు తీర్చడంలో ఎందుకు లేదని.. అధికారం కాదు కావాల్సింది ప్రజా సమస్యలు తీర్చే గుణం ఉండాలని కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త జనంపల్లి అనిరుద్ రెడ్డి అన్నారు. శనివారం ఊరుకొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నిరసన దీక్ష కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో నుండి కూడా కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు, కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలబడుతుందని హితవు పలికారు. ఎంతో మంది నిరుపేదలు ఇల్లు లేక పూరి గుడిసెల్లో, బాత్రూంలో కాలం వెల్లదిస్తుంటే కల్లుండి చూడలేని గుడ్డి వారిలా టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. డబల్ బెడ్ రూమ్ ఇండ్లు హామీలకే పరిమితమయ్యాయని అన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని భూకబ్జాలు చేస్తున్న అధికార పార్టీ నాయకులు ప్రజాసమస్యలు పట్టించుకోవడంలో విఫలం అయ్యారని ఆరోపించారు. ఊరుకొండ మండలం పై ఎమ్మెల్యేకు చిన్నచూపు ఎందుకని వాపోయారు. ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి కూడా ఊరుకొండ మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మించకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.