అయ్యప్ప భక్తుల బస్సు బోల్తా

గుంటూరు,నవంబర్‌19(జనం సాక్షి): శబరిమలకు అయ్యప్ప భక్తులతో బయలుదేరిన బస్సు గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలంలో రోడ్డు డివైడర్‌ను ఢకొని బోల్తాపడింది. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. రాజమండ్రి నుండి శబరిమలకు 42 మంది అయ్యప్ప స్వాములతో బస్సు బయలుదేరింది. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం వద్ద రోడ్డు డివైడర్‌ను ఢకొని బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న నలుగురు స్వాములకు గాయాలయ్యాయి. గాయాలైనవారిలో బస్సు సిబ్బందికి చెందిన ఇద్దరున్నారు. క్షతగాత్రులను వెంటనే 108 వాహనంలో గుంటూరు జిజిహెచ్‌ కి తరలించారు. గాయపడినవారిలో రాజమండ్రి మండలం తూర్పు గోదావరికి చెందిన ఎస్‌కె.జానీ (29), ఎస్‌కె.కాశిం (65), కన్నెపల్లి సూరిబాబు (55), నరేంద్రపురానికి చెందిన ఎర్రంశెట్టి రాము (60) ఉన్నారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని విచారణ చేపట్టారు.