ఆందోల్లో ఈసారి టిఆర్ఎస్ జెండా ఎగురేస్తా
ప్రజల్లో మంచి స్పందన వస్తోంది
టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి క్రాంతి కిరణ్
సంగారెడ్డి,నవంబర్21(జనంసాక్షి):తెలంగాణ అస్థిత్వాన్ని కాపాడే టీఆర్ఎస్కే రానున్న ఎన్నికల్లో ఆశీర్వదించాలని టీఆర్ఎస్ అందోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చంటి క్రాంతి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లో ఆయన ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే టీఆర్ఎస్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని అస్థిత్వాన్ని కాపాడుతుందని తెలిపారు. ఈ ఎన్నికల్లో ఓటర్లు చైతన్యంతో ఆలోచించి ఓటువేయాలని కోరారు. అందోల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ జెండా ఎగురడం ఖాయమని క్రాంతి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాల అమలుపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, కేసీఆర్ పాలనపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. రైతులు పంటలను పండించు కునేందుకు అవసరమైన పెట్టుబడిని రైతుబంధు పథకం ద్వారా అందించేందుకు శ్రీకారం చుట్టిందని అన్నారు. ఈ పథకాన్ని ఇప్పటివరకు రెండు విడుతలుగా నగదును రైతులకు అందజేశామని చెప్పారు. దేశంలో ఏక్కడా లేని విధంగా ప్రజా సంక్షేమ పథకాలు మనరాష్ట్రంలో కొనసాగుతున్నాయని, ఈ ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. ప్రజల ఆశిస్సులు, దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలన్నారు. కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి పనులు, అమలు చేసిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన వారందరూ టీఆర్ఎస్ వైపు ఉన్నారన్నారు. సింగూర్ ప్రాజెక్టు నిర్మాణం హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం నిర్మించారని, కానీ అందోలు, పుల్కల్ మండలాల ప్రజల తాగుకు, సాగుకు అందించాలన్న ఏకైక లక్ష్యంతో అప్పట్లో కేసీఆర్ కాలువ నిర్మాణానికి అవసరమైన నిధులను రూ. 90 కోట్లను మంజూరు చేయించారని క్రాంతికిరణ్ తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే సింగూర్ నీటిని హైదరాబాద్కు తరలించకుండా అడ్డుకున్నారని, అందోలు, పుల్కల్ మండలాల సాగుకు, తాగుకు అందిస్తున్నారన్నారు. మహాకూటమి అభ్యర్థి దామోదర్ రాజనర్సింహ అందోలు ప్రజలకు చేసేందేమి లేదని, సింగూర్ ప్రాజెక్టు నిర్మాణంలో భూములు, ఇండ్లు కొల్పోయిన వారికి నష్టపరిహారాన్ని ఇప్పించలేకపోయారన్నారు. అందోలు-జోగిపేట మున్సిపాలిటీ అభివృవద్ధి కోసం ప్రభుత్వం రూ. 25 కోట్లను మంజూరు చేస్తే, అవి ఇప్పటికి అలాగే ఉన్నాయని, దానికి కారణం బీజేపీ అభ్యర్థి బాబూమోహన్నేనని ఆయన అన్నారు. నియోజకవర్గ అభివృద్దికోసం సీఎం కేసీఆర్ వద్దకు బాబూమోహన్ వెళ్లకపోగా, కావాలనే సీఎంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇవన్నీ స్థానిక ప్రజలకుతెలుసన్నారు.




