ఆఫ్గనిస్థాన్‌లో ప్రభుత్వ భవనంపై ఉగ్రదాడి

– 11మంది మృతి
జలాలాబాద్‌, జులై11(జ‌నం సాక్షి) : అఫ్గానిస్థాన్‌లోని జలాలాబాద్‌ ప్రావిన్స్‌లోని నంగ్రహార్‌లోని ప్రభుత్వ విద్యావిభాగ భవనంపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ భవనంలోని చొరబడిన ఉగ్రవాదులు అందులోని ఉద్యోగులను, ప్రజలను బందీలుగా చేసుకున్నారు. దీంతో అఫ్గానిస్థాన్‌ భద్రతా దళాలు అక్కడకు చేరుకొని ఉగ్రవాదులతో పోరాటానికి దిగాయి. ఇప్పటివరకు ఈ ఎన్‌కౌంటర్‌లో 11మంది మృతి చెందగా.. మరో 10మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో పిల్లలు కూడా ఉన్నారు. బుధవారం రాత్రి వరకు ఉగ్రవాదుల కోసం ఆపరేషన్‌ కొనసాగుతూనే ఉంది. భవనంలో కచ్చితంగా ఎంత మంది చిక్కుకుపోయారనే విషయాన్ని అధికారులు చెప్పలేకపోతున్నారు. ఇప్పటివరకు ఈ పోరులో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో ఒకరు తనను తాను పేల్చుకొని మరణించగా, మరొకరిని భద్రతా దళాలు కాల్చి చంపాయి. ఇప్పటివరకు ఈ ఘటకు ఏ ఉగ్రవాద సంస్థా బాధ్యత తీసుకోలేదు. మంగళవారం తాలిబన్లకు
ఆఫ్గాన్‌ దళాలకు మధ్య భారీ పోరాటం జరిగింది. ఈ పోరాటంలో ఒక పోలీస్‌ అధికారి కూడా ప్రాణాలు కోల్పోయారు. 33 మంది తాలిబన్లను దళాలు హతమార్చాయి. ఈ ఘటన ఖొగ్యానీ ప్రాంతంలో జరిగింది.