‘ ఆమ్‌ఆద్మీ ‘ కన్వీనర్‌గా కేజ్రీవాల్‌

ఢిల్లీ : అరవింద్‌ కేజ్రీవాల్‌ బృందం స్థాపించిన కొత్తపార్టీ ఆమ్‌ఆద్మీకి కేజ్రీవాల్‌ను కన్వీనర్‌గా ఎన్నుకున్నారు. శనివారం ప్రారంభమైన ఈ పార్టీ మొదటి జాతీయ కార్యవర్గ సమావేశం ఆదివారం ఢిల్లీలో జరిగింది. పార్టీ జాతీయ కార్యదర్శిగా పంకజ్‌గుప్తా, కోశాధికారిగా కృష్ణకాంత్‌ ఎన్నికయ్యారు. 23 మంది సభ్యుల జాతీయ కార్యవర్గం ఈ ముగ్గురిని ఏకగ్రీవంగా ఎన్నుకుంది. పార్టీ రిజిస్ట్రేషన్‌ కోసం ఎన్నికల సంఘాన్ని సంప్రదించడానికి కార్యవర్గం పురమాయించింది. బ్యాంక్‌ ఖాతాలు తెరవడం, విరాళాలు సేకరించడం కోసం కూడా అవసరమైన చర్యలు ప్రారంభించామని కేజ్రీవాల్‌ చెప్పారు.  జాతీయ కార్యవర్గం మళ్లీ మంగళ, బుధవారాల్లో సమావేశం కానుంది. పార్టీ ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారం జరుగుతుంది. దీనికి ముందు కేజ్రీవాల్‌ ఆయన బృందం సివిల్‌లైన్స్‌లోని అంబేద్కర్‌భవన్‌ను సందర్శిస్తారు.