ఆర్టీసి సమ్మెకు పరిష్కారం చూపండి
– టీజేఏసీ చైర్మన్ కొదండరావమ్
హైదరాబాద్,మే 11 (జనంసాక్షి):
ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం సూచించారు. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగినందున వేతన సవరణ చేయాలన్నారు. ఉద్యోగాలను పణంగా పెట్టి సమ్మె చేస్తున్న కార్మికుల న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు వారికి జేఏసీ అండగా నిలుస్తుందని చెప్పారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఆయన సంఘీభావం ప్రకటించారు. కార్మికుల డిమాండ్లను పరిష్కరించడంలో ఆర్టీసీ యాజమాన్యం మొండివైఖరి మానుకోవాలని చెప్పారు. కార్మికులకు 43 శాతం ఫిట్మెంట్ ఇవ్వాల్సిందేనని, చెప్పారు. ఈ తేడాను పూర్తి చేసే బాధ్యత యాజమాన్యానిదేనని కోదండరాం పేర్కొన్నారు. ఇటు యాజమాన్యం, అటు కార్మికులు ఒక మెట్టు దిగి సమస్యకు పరిష్కారం దొరికిలా దోహదపడాలని సూచించారు.
ఆర్టీసీ సమ్మెను కొనసాగిస్తామని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. తమ సమ్మె చట్టబద్ధమేనని, హైకోర్టులో మంగళవారం తమ వాదనలు వినిపిస్తామని ఆయన సోమవారమిక్కడ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరిన మూడు వారాల గడువు ఇవ్వలేమని ఎంప్లాయిస్ యూనియన్ నేత పద్మాకర్ తెలిపారు. సమ్మె జరుగుతున్నప్పుడు ఆర్టీసీలో నియమకాలు చేపట్టడం చట్టవిరుద్ధమన్నారు. కాంట్రాక్ట్ కార్మికులు కూడా తాము చేస్తున్న సమ్మెకు మద్దతు ఇవ్వాలని పద్మాకర్ కోరారు. ఆర్టీసీ ఆదాయాన్ని పన్నుల రూపంలో ప్రభుత్వం దండుకుంటుందని వారు ఆరోపించారు. సమ్మె కొనసాగిస్తామని, వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.