ఆర్టీసీ సమ్మెకు.. ప్రభుత్వ వైఫల్యమే కారణం
– కేసీఆర్ పాలన రజాకారుల రాజ్యాన్ని తలపిస్తుంది
– మాజీ ఆర్టీసీ చైర్మన్ సత్యనారాయణ
కరీంనగర్, అక్టోబర్5 (జనంసాక్షి): ఆర్టీసీ సమ్మెకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని, ఆర్టీసీ పెద్ద సంస్థ అని, అలాంటి సంస్థను ప్రభుత్వం కాపాడుకోవాలని, కానీ చంపేయాలని చూడటం సరికాదని తెలంగాణ ఆర్టీసీ మాజీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనను చూస్తుంటే రజాకారుల రాజ్యాన్ని తలపిస్తుందని విమర్శించారు. ఆర్టీసీ సమ్మెకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులు గతంలో తెలంగాణ సాధన కోసం సమ్మెలోకి వెళితే… ఇప్పుడు కూడు కోసం సమ్మెలోకి వెళ్లారని వ్యాఖ్యానించారు. ఆర్టీసీని తమ సొంత సంస్థలా భావించే కార్మికులను ప్రభుత్వం విస్మరించిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో పెద్ద సంస్థ అయిన ఆర్టీసీని చంపేయాలని చూడడం సరియైన పద్దతి కాదని, ఆర్టీసీని బ్రతికించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 3వేల 3వందల కోట్ల నష్టంలో ఉన్న ఆర్టీసీ రోజుకు 3కోట్ల రూపాయల నష్టంలో నడుస్తోందని, దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వమని ధ్వజమెత్తారు. ప్రపంచ వ్యాప్తంగా క్రాస్ సబ్సిడీ ఉంటుందని, కానీ మన రాష్ట్రంలో క్రాస్ సబ్సిడీ లేదన్నారు. 10వేల బస్సుల్లో 2వేల బస్సులకు కాలం చెల్లిపోయినా ప్రభుత్వం కొత్త బస్సులను తెప్పించడంలో విఫలమైందన్నారు. ఆర్టీసీకి జీహెచ్ఎంసీ రూ.1470 కోట్లు ఇవ్వాలని లేదంటే ప్రభుత్వమైనా ఈ మొత్తం చెల్లించాలని సోమారపు సత్యనారాయణ డిమాండ్ చేశారు.