ఆలయాల్లో దుబారా ఖర్చులపై నజర్‌

ఇకపై పక్కాగా లెక్కలకు కసరత్తు

అమరావతి,డిసెంబర్‌5(జ‌నంసాక్షి): రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో అనవసర ఖర్చులు, నిధుల దుబారా పై పూర్తిస్థాయి నియంత్రణ తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా నిధుల జమాపద్దులపై ఖచ్చితత్వంతో ఉండాలని నిర్ణయించారు. అలాగే ప్రధాన ఆలయాల్లో నిధుల వినియోగంపై జవాబుదారి తీసుకురావాలని, ఆర్థిక క్రమశిక్షణ ఒక్కటే ఇందుకు పరిష్కారమని భావిస్తోంది. తిరుమల దేవస్థానానికి ఏటా వేల కోట్ల ఆదాయం వస్తోంది. ఖర్చూ ఆ స్థాయిలోనే ఉంటుంది. అయితే నిధుల వ్యయంలో దుబారా, అక్రమాలను నిరోధించేందుకు అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ప్రతీ రూపాయి ఖర్చుకు జవాబుదారీ వచ్చింది. ఇందుకు అకౌంటింగ్‌ రంగంలో విప్లవాత్మక మైన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. రాష్ట్రంలోని ఏడు ప్రధాన ఆలయాలైన శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం, కనకదుర్గమ్మ, ద్వారకా తిరుమల, అన్నవరం, సింహాచలం ఆలయాల్లోనూ అకౌంటింగ్‌ విధానం ఉంది. అయితే అది టీటీడీ తరహాలో లేదు. వాటిల్లో కార్య నిర్వహణ అధికారులదే పెత్తనం. వారు ఆదేశించినట్లుగా నిధుల వినియోగం జరగాలి. వీటిలో లోతైన పరిశీలన, పర్యవేక్షణ, పక్కా అకౌంటింగ్‌ విధానం లేదని ప్రభుత్వం గుర్తించింది. నిధుల దుబారా కూడా ఎక్కువగానే ఉంటోందని, అనవసర ఖర్చులు విపరీతంగా ఉంటున్నాయని నిర్ధారించింది. ఈ నేపథ్యంలో ప్రధాన ఆలయాల్లోనూ పక్కా అకౌంటింగ్‌ విధానం తీసుకురావాలని దేవాదాయ శాఖ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఏడు ప్రధాన ఆలయాల్లో నిధుల వినియోగం తీరు, ఇతర ఆర్థిక అంశాలపై అకౌంటింగ్‌ నిపుణులతో పరిశీలన చేయించారు. నిపుణుల నివేదిక మేరకు ఎప్పటికప్పుడు సవిూక్ష చేసేందుకు, ప్రభుత్వ స్థాయిలో తగిన నిర్ణయాలు తీసుకునేందుకు దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి నేతృత్వాన హైలెవల్‌ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అకౌంటింగ్‌ నిపుణులు ఆలయాలను సందర్శించి నిధుల రాబడి, వ్యయం, ఇతర ఖర్చుల వివరాలను, ప్రస్తుతం కొనసాగిస్తున్న అకౌంటింగ్‌ విధానాన్ని పరిశీలిస్తారు. అనంతరం ఆలయ ఆర్థిక నిర్వహణపై హైలెవల్‌ కమిటీకి నివేదిక ఇస్తారు.వారు ఇచ్చిన సిఫారసుల ఆధారంగా ఆలయాల ఆర్థిక నిర్వహణపై నివేదికలు తయారు చేస్తారు. ఆపై ఏ ఆలయంలో ఎలాంటి ఆర్థిక వ్యవస్థ నెలకొంది. అందులోని లోపాలకు చికిత్స ఎలా చేయాలన్న దానిపై హైలెవల్‌ కమిటీ నిర్ణయాలు తీసుకుంటుంది. అనంతరం ఏడు ప్రధాన ఆలయాల్లో ప్రభుత్వం ఆధునిక అకౌంట్‌ విధానం తీసుకురానుంది. ఇందుకోసం బహుళ ప్రాచుర్యం పొందిన ట్యాలీ విధానం అమలు చేయనున్నారు. టీటీడీలో దీన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. కాబట్టి ఇదే విధానం ఏడు ప్రధాన ఆలయాల్లోనూ అమలు చేయాలని భావిస్తున్నారు.