ఇద్దరు పిల్లల పాలసీకి వ్యతిరేకం

చైనా చేసిన తప్పును మనం చేయరాదన్న ఓవైసీ

హైదరాబాద్‌,జూలై14(జనం సాక్షి): కుటుంబ నియంత్రణకు తాను బద్ద వ్యతిరేకినని, ఇద్దరు పిల్లల పాలసీకి తాను వ్యతిరేకమని ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ తెలిపారు. ఇద్దరు పిల్లల పాలసీ దేశానికి ఏమాత్రం ఉపయోగకరం కాదని అయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. చైనా చేసిన తప్పును భారత్‌ చేయకూడదని హెచ్చరించారు. దేశంలో ఫెర్టిలిటీ రేట్‌ తగ్గిపోతోందని, 2030 వరకు ఇది స్థిరీకరించబడుతుందని పేర్కొన్నారు. ఇక అన్‌ పార్లమెంటరీ పదాల ఇష్యూపై అసదుద్దీన్‌ స్పందించారు. పార్లమెంట్‌లో మాట్లాడేటప్పుడు ఏ విషయంపై మాట్లాడుతు న్నామనేది చాలా ముఖ్యమని ఆయన అన్నారు. అంతేగానీ ఫలానా పదాలు అసభ్య పదాలు అని ఎలా అంటారని ప్రశ్నించారు. కొత్త పార్లమెంట్‌ భవనంపై జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరిస్తున్న సమయంలో పీఎం మోడీ వెనుక లోక్‌ సభ స్పీకర్‌ కూర్చోడాన్ని అన్‌ పార్లమెంటరీ కాదా అని ప్రశ్నించారు.