ఇల్లెందు అభివృద్దిని బేరీజు వేయండి

అభివృద్ది చేసిన టిఆర్‌ఎస్‌నే గెలిపించండి: కోరం

ఖమ్మం,నవంబర్‌24(జ‌నంసాక్షి): ఇల్లెందు నియోజకవర్గాన్నికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహకారంతో కోట్లాది రూపాయలు వెచ్చించి అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి కోరం కనకయ్య అన్నారు. దశబ్దాల తరబడి కాంగ్రెస్‌, టీడీపీల పాలనను చూశామని, ఈ నాలుగు సంవత్సరాల టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనను చూశాక అభివృద్ది అంటే ఏమిటో ప్రజల కళ్లకు కనబడుతోందన్నారు. వివిధ గ్రామాల్లో ఆయన ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి మళ్లీ తనను గెలిపిస్తే అభివృద్ధిలో ఇల్లెందు నియోజకవర్గాన్ని ప్రథమ స్థానంలో నిలిపేలా కృషి చేస్తానన్నారు.

ప్రతిపక్ష పార్టీల నాయకులు,అభ్యర్థులు చెప్పే మాటల గారడీలకు మోసపోవద్దన్నారు. మన అభివృద్ధి కోసం, భావితరాల బాగు కోసం టీఆర్‌ఎస్‌ పార్టీకి మద్ధతుగా నిలిచి తనను గెలిపించాలని అన్నారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వ హయాంలోనూ జరగని అభివృద్ధి, సంక్షేమ పథకాలు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో జరిగిందన్నారు. ప్రతిపక్షాల మోసపూరిత హావిూలను నమ్మవద్దని, ప్రజలు సంక్షేమానికి అన్నివేళలా కృషి చేసే టీఆర్‌ఎస్‌నే గెలిపించాలని కోరారు. టీఆర్‌ఎస్‌ మరో 20 ఏండ్లు అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీ పార్టీల నాయకులు కేవలం ఎన్నికలప్పుడు వచ్చి వెళ్తారని, ఎన్నికల అనంతరం కనిపించకుండా పోతారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ అహర్నిశలు కృషి చేస్తున్నారని, పంట పెట్టుబడి సాయం, 24 గంటల ఉచిత కరెంట్‌, రైతుబీమా వంటి పథకాలు దేశంలోనే వినూత్నమైన పథకాలన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని, ప్రజల ఆకాంక్ష మేరకు పనులు చేసిన వ్యక్తినని తెలిపారు.