ఉపరితల గనిలో రికార్డుస్థాయి బొగ్గు ఉత్పత్తి

కార్మికులను అభినందించిన జిఎం
ఖమ్మం,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): సింగరేణి జేకే ఉపరితల గని కార్మికుల కృషితోనే రికార్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తి సాధించామని జీఏం కందుకూరి లక్ష్మీనారాయణ అన్నారు. బొగ్గు ఉత్పత్తిలో 54 రోజుల ముందే జేకే ఉపరితల గని కార్మికులు లక్ష్యాన్ని సాధించారన్నారు. గని లక్ష్యం 28లక్షల టన్నులు కాగా, ముందుగానే ఈ లక్ష్యాన్ని చేరుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన జేకే ఉపరితల గనిలో కార్మికులకు మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తక్కువ రోజుల్లో ఎక్కువ ఉత్పత్తి సాధించిన కార్మికులు, అధికారులకు అభినందనలు తెలుపుతున్నామన్నారు. కార్మికులు భవిష్యత్‌లో మరింత ఉత్పత్తి సాధించేందుకు అవసరమైన సహకారం సంస్థ అందిస్తుందన్నారు. కార్మికులు నిరంతరం రక్షణ సూత్రాలను పాటిస్తూ విధులు నిర్వహించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏజెంటు బొల్లం వెంకటేశ్వర్లు కార్మికులు పాల్గొన్నారు.