ఉస్మానియాను కాపాడండి
– హైకోర్టులో పిల్
హైదరాబాద్,ఆగస్టు4(జనంసాక్షి):
ఉస్మానియా ఆసుపత్రిని కూల్చివేస్తామంటూ ప్రభుత్వం ప్రకటన చేయడంతో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కూల్చివేతను అడ్డుకోవాలంటూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ వ్యాజ్యాన్ని హైకోర్టు మంగళవారం విచారించింది. ఆస్పత్రి కూల్చివేతపై ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వకుండానే పిల్ ఎలా దాఖలు చేశారని పిటిషనర్కు హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వ ఉత్తర్వులు ఏమైనా ఉంటే వారంలోగా సమర్పించాలిని పిటిషనర్ను ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. ఇదిలావుంటే ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణానికి సంబంధించి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉస్మానియా ఆస్పత్రి భవనాన్ని మొత్తం కూల్చివేయబోమని కేవలం పైకప్పు మాత్రమే కూల్చేసి పాతగోడలపై కొత్త భవనాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. పది, పదిహేను అంతస్తులతో కొత్తభవన నిర్మాణం ఉంటుందని మహమూద్ అలీ చెప్పారు.