దానం అనర్హతపై ముగిసిన విచారణ
` కౌశిక్ రెడ్డి పిటిషన్ ఆధారంగా క్రాస్ ఎగ్జామిన్
` సమయం కోరిన బీజేపీ నేత మహేశ్వరెడ్డి
` 18న విచారణకు హాజరు కావాలని గడువు
హైదరాబాద్(జనంసాక్షి): పార్టీ ఫిరాయింపు కేసులో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విచారణ పూర్తయ్యింది. బీఆరఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి వేసిన పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ చేపట్టారు. దానంపై అనర్హత వేటు వేయాలని పాడి కౌశిక్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు. ముందుగా బీఆరఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిగింది. దానం తరఫున న్యాయవాదులు కౌశిక్ రెడ్డిని క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. దానంపై పిటిషన్ ఎందుకు వేశారు?.. పార్టీ మారారని చెప్పేందుకు గల ఆధారాలపై పాడి కౌశిక్ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తన వద్ద ఉన్న ఆధారాలను స్పీకర్కు బీఆరఎస్ ఎమ్మెల్యే అందజేశారు. బీఆరఎస్ నుంచి దానం పోటీ చేసి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందడం, ఆ తరువాత కాంగ్రెస్ నుంచి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేయడం, దానం ప్రచార ఫొటోలు, వీడియోలు.. దానం కాంగ్రెస్ కండువా వేసుకున్న ఫొటోలను స్పీకర్ ముందు ఉంచారు పాడి కౌశిక్ రెడ్డి. దీంతో స్పీకర్ ఎదుట పాడి కౌశిక్ రెడ్డి విచారణ ముగిసింది. ఇక, దానం నాగేందర్ అనర్హత పిటిషన్పై సాక్ష్యాలను అఫిడవిట్ రూపంలో దాఖలు చేశారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. మహేశ్వర్ రెడ్డి తరఫు న్యాయవాదులు.. స్పీకర్ ముందు హాజరయ్యారు. దానం నాగేందర్ను అనర్హుడిగా ప్రకటించేందుకు ఎవిడెన్స్ అఫిడవిట్ను పొందుపరిచానని మహేశ్వర్ రెడ్డి తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తాను వ్యక్తిగతంగా హాజరుకాలేనని ఆయన తెలిపారు. వ్యక్తిగతంగా హాజరు కావాలంటే సమయం కావాలని విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరి 20 తరువాత సమయం ఇస్తే తాను విచారణకు వ్యక్తిగతంగా హాజరవుతానని అఫిడవిట్లో మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. దీంతో బీజేపీ పిటిషన్పై ఫిబ్రవరి 18న స్పీకర్ విచారించనున్నారు. ఇక, పార్టీ ఫిరాయింపుల కేసు కీలక దశకు చేరుకుంది. ఇప్పటివరకూ పది మంది ఎమ్మెల్యేలపై ఆరోపణలు రాగా.. ఎనిమిది మందికి సంబంధించిన విచారణ పూర్తి అయ్యింది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి విచారణ జరగాల్సి ఉండగా… దానంను స్పీకర్ విచారించారు. దానం చెప్పే విషయాలను స్పీకర్ పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. గతంలో ఎనిమిది మంది ఎమ్మెల్యేల విచారణ సమయంలోనూ ఇదే జరిగింది. విచారణ సమయంలో ఏ పార్టీలో ఉన్నారనే విషయాన్ని ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కుంటున్న ఎమ్మెల్యేలను స్పీకర్ ప్రశ్నించగా.. వారంతా బీఆరఎస్లోనే ఉన్నామని సమాధానం ఇచ్చారు. ఇక దానం నాగేందర్ కూడా మొన్నటి వరకు తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని, అవసరమైతే ఉపఎన్నికకు వెళ్లేందుకు సిద్ధమని ప్రకటించారు. అయితే గత రెండ్రోజులుగా దానం యూటర్న్ తీసుకున్న పరిస్థితి. తాను బీఆరఎస్లోనే ఉన్నానని, పార్టీకి ఇంకా రాజీనామా చేయలేదని చెప్ప్పుకొచ్చారు. స్పీకర్ తనపై అనర్హత వేటు వేస్తే.. ఉప ఎన్నికకు సిద్ధమని దానం పదేపదే చెప్ప్పుకొచ్చారు. ఈ క్రమంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
దానంపై అనర్హత వేటు వేయాలి
` ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగాలి
` అనర్హత పిటిషన్పై స్పీకర్ గడ్డం ప్రసాద్ను కోరిన ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి
హైదరాబాద్: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్పై స్పీకర్ గడ్డం ప్రసాద్ చేపట్టిన విచారణకు బీఆరఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి హాజరయ్యారు. మున్సిపల్ ఎన్నికల హడావుడి ఉన్నప్పటికీ.. తాను హాజరైనట్లు తెలిపారు. విచారణ అనంతరం ఆయన విÖడియాతో మాట్లాడారు. “దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని స్పీకర్ను కోరాం. ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగాలని విన్నవించాం. భాజపా, కాంగ్రెస్ ఒక్కటే.. వారి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఉంది” అని కౌశిక్ రెడ్డి అన్నారు. ఇక గురువారం జరిగిన ఘటనపై స్పీకర్కు ప్రివిలేజ్ మోషన్ ఇచ్చినట్లు కౌశిక్రెడ్డి తెలిపారు. తన సొంత గ్రామం వీణవంకలో పోలీసులు ఓవరాక్షన్ చేశారని ఆరోపించారు. ఆ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు. తనకు న్యాయం జరిగే వరకూ అధికారులను వదిలిపెట్టనని స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా వీణవంకలో నిర్వహించే సమ్మక్క`సారలమ్మ జాతరలో దళిత సర్పంచి సరోజను కొబ్బరికాయ కొట్టనివ్వడం లేదని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి తన కుటుంబసభ్యులతో కలిసి గురువారం రాత్రి నిరసన తెలిపారు. సమ్మక్క గద్దెకు చేరిన తరువాత మొదటి కొబ్బరికాయ తామే కొడతామని ఆయన భీష్మించారు. దళిత మహిళా సర్పంచిని అవమానించిన ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేస్తానన్నారు. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని, భక్తులకు ఇబ్బంది కలుగుతుందని పోలీసులు సర్దిచెప్పినా వినలేదు. దీంతో కౌశిక్రెడ్డితోపాటు ఆయన సతీమణిని బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.



