ఎల్‌ఆర్‌ఎస్‌ను ఉచితంగా అమలు చేయాలి

గతంలో ఇచ్చిన హావిూ మేరకు సాగాలి
సిఎం రేవంత్‌కు హరీష్‌ రావు బహిరంగ లేఖ
హైదరాబాద్‌,ఆగస్ట్‌26 (జనం సాక్షి):  ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీమ్‌ను ఉచితంగా అమలు చేయాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. ఎన్నికలకు ముందు ఉచితమని చెప్పి.. ఇప్పుడు ఫీజులు వసూలు చేయడం దుర్మార్గమన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు. అధికారులకు లక్ష్యాలు విధిస్తూ ప్రజలను వేధిస్తున్నారని విమర్శించారు. ఎల్‌ఆర్‌ఎస్‌ ఉచితంగా అమలయ్యేలా చూసే బాధ్యత భారాస తీసుకుంటుందన్నారు. ఎన్నికలకు ముందు అన్ని ఫ్రీ అన్నారు.. ఇప్పుడేమో ప్రతిదానికి ఫీజులు వసూలు చేస్తున్నారంటూ హరీశ్‌రావు మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హావిూ ప్రకారం.. ఎల్‌ఆర్‌ఎస్‌(భూముల క్రమబద్దీకరణ) పథకాన్ని పూర్తి ఉచితంగా అమలు చేయాలని కాంగ్రెస్‌
ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్‌ రెడ్డికి హరీశ్‌రావు బహిరంగ లేఖ రాశారు. ఒకవైపు రుణమాఫీ కాక, రైతు బంధు రాక రైతన్నలు ఆవేదన చెందుతుంటే, మరోవైపు విషజ్వరాలతో సామాన్య ప్రజలు ఆసుపత్రుల పాలై, ఖర్చులు భరించలేక అల్లాడుతున్నారు. ఇలాంటి ప్రధానమైన సమస్యలను పరిష్కరించి ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన విూ ప్రభుత్వం, ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజులు వసూలు చేయాలని కలెక్టర్‌ స్థాయి నుంచి పంచాయతీ సెక్రెటరీ వరకు ఉన్న యంత్రాంగం విూద తీవ్ర ఒత్తిడి చేస్తున్నది. పంచాయతీ సెక్రెటరీలు, బిల్‌ కలెక్టర్లు రోజుకు మూడు నాలుగు సార్లు ఫోన్లు చేస్తూ ప్రజలను వేధిస్తున్నారు. ఫీజులు చెల్లించకుంటే లేఅవుట్లు రద్దు చేస్తామంటూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నారు. డిమాండ్‌ నోటీసులు ఇస్తూ టాª`గ్గంªట్లు పెట్టి మరీ మొత్తం 15వేల కోట్లు వసూళ్లు చేయాలని ఆదేశాలివ్వడమంటే ప్రజల రక్తమాంసాలను పీల్చడమే. విూ ప్రభుత్వ దుర్మార్గ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ అంటే దోపిడీ అన్న విూరు.. ఈ రోజు ప్రజలనెందుకు దోపిడీ చేస్తున్నారో సమాధానం చెప్పాలి. నాడు ఫ్రీఫ్రీఫ్రీ అని, నేడు ఫీజు ఫీజు ఫీజు అంటున్నారు. ప్రజలు దాచుకున్న సొమ్మును నిలువునా దోచుకునే కుట్ర చేస్తున్నారు. స్వయంగా విూతో సహా ప్రస్తుతం విూ కేబినెట్‌లో సహచరులుగా ఉన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఉత్తంకుమార్‌ రెడ్డి, సీతక్క, కోమటిరెడ్డి వంటి నేతల మాటలను విూకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నానని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ మెడలు వంచి ఎల్‌ఆర్‌ఎస్‌ను ఉచితంగా అమలు చేయించే బాధ్యత బీఆర్‌ఎస్‌ తీసుకుంటుందని స్పష్టం చేస్తున్నాం అని హరీశ్‌రావు పేర్కొన్నారు.