ఎవరెస్టు విజేత పూర్ణకు ఐక్యరాజ్య సమితి ఆహ్వానం
నిజామాబాద్ సెప్టెంబర్1(జనంసాక్షి):
మలావత్ పూర్ణ. కృషి…పట్టుదలకు మారు పేరు. ఇప్పటికే అతిచిన్న వయసులో ఎవరెస్ట్ ఎక్కి అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. ప్రపంచ దృష్టిని తనవైపు తిప్పుకుంది. కోట్లాది మంది పేద విద్యార్థులకు ఆదర్శంగా నిలిచింది. ఆమె ప్రతిభకు ఇప్పుడు ఐక్య రాజ్య సమితి సైతం పట్టం కట్టింది. అంతర్జాతీయ వేదికపై ప్రసంగించే అరుదైన అవ కాశాన్ని కల్పిస్తోంది.మలావత్ పూర్ణ. గిరిజన తండాలోని అత్యంత పేద కుటుంబంలో పుట్టింది. ఈమె స్వగ్రామం నిజామాబాద్ జిల్లా పాకాల గ్రామం. ఈమె సంకల్ప బలం ముందు ఎవరెస్టు శికరం సైతం తలవంచింది. సాంఘిక సంక్షేమశాఖ సహకారంతో భారత జెండాను ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్టు శిఖరాగ్రంపై ఎగురవేసింది పూర్ణ. టీఎస్, ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ, ఫ్రాన్స్ అడ్వెంచర్స్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఈ విద్యార్థిని ఆ సాహస యాత్రను పూర్తి చేసింది. ఒకవైపు చదువులో దూసుకెళుతూ మరోవైపు స్పోర్స్ట్లోనూ రాణిస్తోంది. తనదైన శైలిలో విజయాలను తన ఖాతాలో వేసుకుంటూ విజయపరంపర కొనసాగిస్తోంది.గత ఏడాది పూర్ణ ఎవరెస్ట్ శికరాన్ని అధిరోహించింది. ఈ ఏడాది ఐక్యరాజ్య సమితిలో భారత్లో పేదరికం అనే అంశంపై ప్రసంగించేందుకు ఆహ్వానం అందింది. అలాగే చిల్డ్రన్స్ డే కు భారత ప్రధాని నరేంద్రమోడీని కలిసే అవకాశాన్ని కూడా పూర్ణ కట్టేసింది.ఐక్యరాజ్య సమితి నుంచి పిలుపు అందుకున్న మలావత్ పూర్ణ. అందుకు సంబంధించిన కసర త్తును ప్రారంభించింది. ఇంతటి అవకాశం రావడానికి కారణం తమ తల్లిదండ్రులు ఇచ్చిన ధైర్యం, సాంఘిక సంక్షేమ గురుకులాల సెక్రటరీ ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ ప్రోత్సహమే అంటోంది.