ఐసీసీ ఛైర్మన్‌గా శశాంక్‌ మనోహర్‌ ఏకగ్రీవంగా ఎన్నిక

దుబాయ్‌,మే15(జ‌నం సాక్షి ): అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసీసీ) ఛైర్మన్‌గా బీసీసీఐ మాజీ ఛైర్మన్‌ శశాంక్‌ మనోహర్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో మనోహర్‌ రెండోసారి పదవీ బాధ్యతలు స్వీకరించారు. మనోహర్‌ 2016లో స్వాతంత్యంగా ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. రెండు సంవత్సరాలు ఎటువంటి రిమార్కులు లేకుండా ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. గత రెండేళ్లలో మనోహర్‌ ఐసీసీలో గుణాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. ఐసీసీ పరిపాలన పద్దతిని సవరించడంతో పాటు, ఐసీసీలో మొదటిసారిగా ఆయన ఒక మహిళకు డైరెక్టర్‌ బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆయనకు ఐసీసీ ఛైర్మన్‌గా మంచి గుర్తింపు వచ్చి రెండోసారి కూడా ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండోసారి ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నికవ్వడం ఎంతో సంతోషంగా ఉంది. నాకు మద్దతు ఇచ్చిన తోటి ఐసీసీ 
డైరెక్టర్లకు ధన్యవాదాలు. గత రెండు సంవత్సరాలుగా మేం కలిసి కట్టుగా ఎన్నో పనులు చేశాము. క్రికెట్‌ని కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా, దాన్ని ప్రపంచక్రీడగా తీర్చిదిద్దామని ఆయన తెలిపారు. శశాంక్‌ తమ ఛైర్మన్‌గా రెండోసారి ఎన్నికవ్వడంపై ఇతర డైరెక్టర్లు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శశాంక్‌కు బీసీసీఐతో పాటు పలువురు క్రికెటర్లు, ప్రముఖులు అభినందనలు తెలిపారు.