ఒకే విడతలో రైతు రుణ మాఫీ చేయండి
– 1300 మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్న చలించరా ?
– పీసీసీ చీఫ్ ఉత్తంకుమార్
వరంగల్,సెప్టెంబర్1(జనంసాక్షి):
రైతుల ఆత్మహత్యలను వారి బాధలను టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. రైతులకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం లేదన్నారు. రుణాల బాధలు తట్టుకోలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా కనీసం వారిని ఓదార్చిన పాపాన పోలేదన్నారు. మంగళవారం వరంగల్లో ఆయన విూడియాతో మాట్లాడారు. 1300 మంది రైతుల ఆత్మహత్యలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలే కారణమన్నారు. ఒకే విడతలో రైతుల రుణాలను మాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ చిత్రమైన పథకాలకు నిధులు ఖర్చు చేస్తున్నారని ఆయన విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల పట్ల అనుసరిస్తున్న విధానాలు దారుణంగా ఉన్నాయని కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు 5 లక్షలు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విడతల వారీ రుణమాఫీని వెంటనే రద్దు చేయాలని, రైతులపై అధిక వడ్డీ భారం వేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రుణమాఫీ విధానంలో లోపాలున్నాయని అన్నారు. మంగళవారం హన్మకొండలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు సదస్సు జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన మల్లు భట్టి విక్రమార్క ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు వల్ల రైతుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ మైనార్టీ సెల్ చైర్మన్ ఖుర్షిద్ అహ్మద్, కుంతియా, ఉత్తమ్కుమార్రెడ్డి, జానారెడ్డి, రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు