కరింనగర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

2

ఆరుగురు మృతి, పదకొండు మందికి తీవ్ర గాయాలు

మృతులకు సీఎం సంతాపం

గోదావరిఖని,జూన్‌5(జనంసాక్షి): గోదావరిఖని రాజీవ్‌ రహదారిపై శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. వరంగల్‌ జిల్లా మొగుళ్లపల్లి మండలం కురుత్యాల గ్రామానికి చెందిన 25 మంది కరీంనగర్‌ జిల్లా గోదావరిఖని సమీపంలో మల్యాలపల్లి గ్రామానికి చెందిన తమ బంధువు అంత్యక్రియలకు లారీలో వచ్చారు. అంత్యక్రియల అనంతరం తిరిగి బయలుదేరి వెళ్తూ గోదావరిఖని వద్ద దారితప్పారు. దీంతో తిరిగి తమ మార్గంవైపు వెళ్తుండగా గోదావరిఖని పవర్‌ హౌస్‌ సమీపంలో ఓ ట్రాలీని లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో బండారి అనిల్‌, బండారి కుమార్‌, బండారి లక్ష్మీ, బండారి చిన్నన్న, మాదరబోయిన ఐలయ్య, అప్పం తమ్మయ్య అక్కడికక్కడే మృతిచెందారు. గాయపడిన వారిని చికిత్సనిమిత్తం గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పందించారు. రోడ్జుప్రమాదంలో మృతి చెందిన వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.