కరువును ఎదుర్కోవడంలో ప్రభుత్వం విఫలం: దిగ్విజయ్
హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని కష్టాలు వెంటాడుతున్నాయి.. టీఆర్ఎస్ ఆకర్ష్తో వలసలు ఓవైపు… కొత్త రాష్ట్రం ఏర్పాటయ్యాక వరుస ఓటములు మరోవైపు కోలుకోలేకుండా చేస్తున్నాయి.. పార్టీ నాయకత్వాన్ని మార్చినా… ఎన్ని ప్రయత్నాలు చేసినా పరిస్థితి మాత్రం అలాగే ఉంది.. దీంతో పార్టీని తిరిగి గాడిలో పెట్టేందుకు అధిష్ఠానం సిద్ధమైంది.. పటిష్ట కార్యాచరణతో రంగంలోకి దిగింది..
సమన్వయ కమిటీకి దిగ్విజయ్ సింగ్ దిశానిర్దేశం ……
పార్టీని బలోపేతం చేసేందుకు అధిష్ఠానం టీ పీసీసీ కార్యవర్గ సమావేశాన్ని వేదికగా చేసుకుంది.. తెలంగాణ ఆవిర్భావం తర్వాత మొదటిసారి ఏర్పాటైన సమన్వయ కమిటీకి పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్ దిశానిర్దేశం చేశారు.. పార్టీలో నెలకొన్ని నైరాశ్యాన్ని తొలగించేందుకు చర్యలు చేపట్టారు.. పార్టీలో క్రమశిక్షణకు పెద్దపీట వేయాలని… పార్టీకి ద్రోహం చేసినవారిని మళ్లీ చేర్చుకోవద్దని సమావేశంలో నిర్ణయించారు.. మండల స్థాయినుంచి ప్రత్యేక సదస్సుల ద్వారా క్యాడర్లో జోష్ నింపేందుకు ప్లాన్ చేస్తున్నారు..
పార్టీ ముఖ్య నేతలు గ్రామాల బాట పట్టాలని ఆదేశం……
ఇక టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టడంలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు దూకుడుగా వ్యవహరించడంలేదని అధిష్ఠానం భావిస్తోంది.. ఈ సమస్య పరిష్కారంకోసం ఢిల్లీ పీసీసీ స్పెషల్ ప్లాన్ వేసింది.. పార్టీ ముఖ్య నేతలు హైదరాబాద్కే పరిమితం కాకుండా… గ్రామాల బాట పట్టాలని ఆదేశించింది.. నేతలు వలస వెళ్లిన నియోజకవర్గాల్లో కొత్తవారికి బాధ్యతలు అప్పగించాలని హై కమాండ్ నిర్ణయించింది.. అలాగే టీఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకోసం ప్రజలతోకలిసి క్షేత్ర స్థాయిలో పోరాటం చేయాలని దిగ్విజయ్ పార్టీ నేతలను ఆదేశించారు. అటు పార్టీకి సవాల్గా మారిన నేతల మధ్య అంతర్గత పోరుకు స్వస్తి పలకాలని డిగ్గీరాజా సూచించారు.. మరి దిగ్విజయ్ పాఠాలు ఎంతవరకూ పనిచేస్తాయో వేచి చూడాలి..