కర్ణాటక కెబినెట్‌లో 14 మంది మటాష్‌

5

– 13 మంది కొత్తవారికి స్థానం

బెంగళూరు ,జూన్‌ 19(జనంసాక్షి): కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భారీస్థాయిలో తన క్యాబినెట్‌లో భారీ మార్పులు చేశారు. 14 మంది మంత్రులను తొలగించి, వారి స్థానాల్లో కొత్తగా 13 మందికి తన క్యాబినెట్‌లో చోటు కల్పించారు. కాంగ్రెస్‌ అధిష్ఠానం అనుమతి తీసుకున్న తర్వాత తొమ్మిది మందికి క్యాబినెట్‌ ¬దా, నలుగురికి సహాయ మంత్రి ¬దా కల్పించారు. ఆదివారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ వాజుభాయి వాలా వీరితో ప్రమాణంచేయించారు. అంతకుముందు 14 మంది క్యాబినెట్‌ మంత్రులను తొలగించాలని సీఎం సిద్ధరామయ్య చేసిన సిఫారసును గవర్నర్‌ ఆమోదించారు. క్యాబినెట్‌ మంత్రులుగా తన్వీర్‌సయీట్‌, కగొడు తిమ్మప్ప, రమేశ్‌కుమార్‌, బసవరాజ్‌రాయారెడ్డి, హెచ్‌వై మెటి, ఎస్‌ఎస్‌ మల్లికార్జున్‌, ఎంఆర్‌ సీతారాం, సంతోష్‌లాడ్‌, రమేశ్‌జార్కి¬లి, సహాయ మంత్రులుగా ప్రియాంక్‌ఖర్గె, రుద్రప్ప లమానీ, ఈశ్వర్‌ఖాండ్రే, ప్రమోద్‌మధ్వరాజ్‌ ప్రమాణంచేశారు.కడొగు తిమ్మప్ప, రమేశ్‌కుమార్‌ ఇంతకుముందు అసెంబ్లీ మాజీ స్పీకర్లుగా పనిచేయగా, సహాయమంత్రిగా ప్రమాణంచేసిన ప్రియాంక్‌ఖర్గే.. లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేత మల్లికార్జునఖర్గే కుమారుడు. మంత్రులుగా పేలవమైన పనితీరు ప్రదర్శించిన వారిని, వివాదాల్లో చిక్కుకున్న వారిని తొలగించారని పార్టీ వర్గాల కథనం. క్యాబినెట్‌లోకి మరింత ఉత్సాహవంతులను తీసుకోవాలన్న లక్ష్యంతో కొత్తవారికి చోటు కల్పించారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. మంత్రి పదవులు కోల్పోయిన వారిలో ఖ్వామారుల్‌ఇస్లాం, షామనూర్‌శివశంకరప్ప, వీ శ్రీనివాస ప్రసాద్‌, ఎంహెచ్‌ అంబరీశ్‌, వినయ్‌కుమార్‌ సొరాకె, సతీశ్‌జర్కి¬లి, బాబూరావు చించాంసూర్‌, శివరాజ్‌సంగప్ప తంగడగి, ఎస్‌ఆర్‌ పాటిల్‌, మనోహర్‌ తహసీల్దార్‌, కే అభయచంద్రజైన్‌, దినేశ్‌గుండూరావు, కిమ్మనె రత్నాకర్‌, పీటీ పరమేశ్వర్‌నాయక్‌ ఉన్నారు.క్యాబినెట్‌ పునర్వ్యవస్థీకరణలో సీఎం సిద్ధరామయ్య కులాలు, ప్రాంతాల మధ్య సమతూకం పాటించేందుకు ప్రయత్నించారు. 2013 మే 13న పార్టీ అధికారంలోకి వచ్చిన మూడేండ్ల తర్వాత ఆయన క్యాబినెట్‌ను పునర్వ్యవస్థీకరించడం గమనార్హం. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఇతర ఏఐసీసీ నేతలతో శనివారం జరిపిన చర్చల్లో క్యాబినెట్‌లో మార్పులకు అనుమతి పొందారు. ఇటీవల అసోం, కేరళ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారం కోల్పోయిన నేపథ్యంలో రెండేండ్లలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే సమయాత్తం అయ్యేందుకే ఆయన క్యాబినెట్‌లో మార్పులు చేపట్టారు. ప్రస్తుతం సిద్ధరామయ్య క్యాబినెట్‌ సభ్యుల సంఖ్య 33 మంది. రాజ్యాంగ నిబంధన ప్రకారం మరొకరికి మంత్రిగా అవకాశం కల్పించే అవకాశముంది.