కర్నాటకలో తెలంగాణ భవన్
జెడిఎస్ హావిూ
బెంగుళూరు,మే1(జనం సాక్షి): కర్ణాటకలో తెలంగాణ భవన్ ఏర్పాటుకు కీలక ముందడుగు పడింది. తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ భవన్ నిర్మిస్తామనే హావిూని చేర్చామని జనతాదళ్ (ఎస్) మేనిఫెస్టో కమిటీ చైర్మన్ సింధియా వెల్లడించారు. ఈ హావిూ ఇచ్చిన జేడీఎస్ అధ్యక్షుడు దేవెగౌడకు కేఆర్టీఏ వ్యవస్థాపక అధ్యక్షుడు సందీప్ కుమార్ మక్తాల కృతజ్ఞతలు తెలిపారు. బెంగళూరులో సింధియాను కేఆర్టీఏ అధికార ప్రతినిధి వెంకట్ వనం, సలహాదారు ఎంఎన్ రావు, శివయ్య తదితరులు కలిశారు.తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో శ్రమిస్తున్నారని సింధియా ప్రశంసించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాల వల్ల తెలంగాణవాసులు సంతోషంగా ఉన్నారని కితాబిచ్చారు. కర్ణాటకలో తెలుగు ప్రజలు లక్షల్లో ఉన్నారని, వీరిలో ఎక్కువ మంది కేసీఆర్ అభిమానులని పేర్కొన్నారు. వీరందరి మద్దతుతో ఈసారి తమ పార్టీ ఎన్నికల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జాతీయ పార్టీలు రాష్టాల్ర ప్రయోజనాలను పట్టించుకోకపోవడం వల్లే ప్రజలు ప్రాంతీయ పార్టీలవైపు మొగ్గుచూపుతున్నారని సింధియా స్పష్టం చేశారు.
తమ పార్టీ తెలంగాణ ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు.