కళతప్పిన ‘కాషాయం’

` బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ దూకుడు ఎదుట బలహీనపడ్డ భాజాపా
` సమీపంలోనే ఎన్నికలు.. సింగిల్‌ డిజిట్‌కే అవకాశాలు!
` తెలంగాణకు జాతీయ అగ్రనేతలొస్తున్నా కనిపించని జోష్‌
` అసెంబ్లీ ఎన్నికల పంథాపై ఇప్పటికీ కమలనాథుల మల్లగుల్లాలు
` సర్వశక్తులు ఒడ్డుతున్నా కొంతకాలంగా డీలాపడ్డ పార్టీ శ్రేణులు
` ప్రధాని మోడీ పర్యటన సందర్భంగానూ స్పందన అంతంతే..!
జనంసాక్షి ప్రత్యేక ప్రతినిధి(హైదరాబాద్‌):తెలంగాణలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ దూకుడు మీద ఉండగా భాజాపా మాత్రం పూర్తిగా బలహీనపడినట్టు అర్థమవుతోంది. వరుస సభలూ సమావేశాలు పెడుతున్నప్పటికీ అనుకున్న స్థాయిలో ఆదరణ కరువవుతోంది. బీఆర్‌ఎస్‌ పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించడం, హస్తం పార్టీ ఆరు గ్యారంటీల దరిమిలా ఆ పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తుండగా.. కమలనాథులు మాత్రం ఇంకా అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. అసెంబ్లీ స్థానాలకు వచ్చిన దరఖాస్తుల్లో గెలుపు గుర్రాలు లేకపోవడం ఇప్పటికీ రాష్ట్ర నాయకత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికీ మొదటి జాబితాపై స్పష్టత రాకపోవడం ఆ పార్టీ నాయకత్వం డొల్లతనాన్ని ఎత్తిచూపుతోంది.తెలంగాణ పుంజుకోవాలని ఉవ్విళ్లూరుతున్న కాషాయ పార్టీకి రాష్ట్రంలో స్పందన కరువవుతోంది. ఎన్నికల సమీపిస్తున్నప్పటికీ అవలంబించాల్సిన పంథాపై తర్జనభర్జన పడుతోంది. ఇటీవల ఇందిరాపార్కు వద్ద నిరుద్యోగులకు మద్దతుగా నిరాహార దీక్ష చేపట్టినప్పటికీ పెద్దగా స్పందన రాకపోవడం అగ్రనాయకత్వాన్ని విస్తుపోయేలా చేసింది. పార్టీ శ్రేణులే తప్ప నిజమైన నిరుద్యోగులు అక్కడ కనబడకపోవడంతో కమలనాథులు డైలమాలో పడ్డారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నా పట్టుచిక్కడం లేదు. పార్టీ కార్యక్రమాలు పెద్దగా లేకపోవడంతో శ్రేణులు కూడా డీలాపడ్డాయి. యువతలో కూడా ఆసక్తి తగ్గిందని పలువురు నేతలు గుసగుసలాడుతున్నారు. ఈ నేపథ్యంలో అగ్రనేతలతో బహిరంగ సభలు నిర్వహించి మళ్లీ బలోపేతం కావాలని యత్నిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు.
సింగిల్‌ డిజిట్‌కే అవకాశం..!?
దరఖాస్తులు భారీ స్థాయిలో వచ్చాయని చెబుతున్న బీజేపీ నేతలు అందులో ఛరిష్మా గల నేతలను వడబోసినా కనబడటం లేదు. మొదట్లో సీనియర్లే దరఖాస్తులు చేయకపోవడంతో ఉన్న ఉత్సాహం కాస్త నీరుగారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చివరకు అధిష్టానం మొట్టికాయలతో అయిష్టంగానే దరఖాస్తులు సమర్పించిన పలువురు సీనియర్‌ నేతలు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సుముఖంగా లేనట్టు తెలిసింది. ఊహించిన స్థాయిలో చేరికలు లేకపోవడం, అక్కడక్కడ ఉన్న కొందరు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ గూటికి చేరిపోవడంతో పార్టీ పూర్తిగా చేష్టలుడిగింది. గత కొన్ని నెలల క్రితం అధికారంలోకి వచ్చేశామన్నట్టు ఫోజులిచ్చిన బీజేపీ.. ప్రస్తుతం సింగిల్‌ డిజిట్‌కే పరిమితమైందని రాజకీయ విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు. ఆ పార్టీలో ఇప్పటికీ స్క్రీనింగ్‌ కమిటీ లేకపోవడం, దరఖాస్తుల పరిశీలన కాకపోవడం, తొలి జాబితాపైనా స్పష్టత లేకపోవడం పార్టీ క్యాడర్‌ను మరింత నిరుత్సాహానికి గురిచేస్తోంది.
పొంగుతూ.. చల్లారుతూ..
బీజేపీ నేతల సమన్వయం విషయంలో ఆగ్రహావేశాలు పొంగినట్టే పొంగి తరచూ చల్లారడం రాజకీయ వర్గాల్లో హాస్యాస్పదానికి కారణమవుతున్నాయి. అంతర్గత కలహాలు కల్లోలం సృష్టిస్తున్నప్పటికీ అది నేటికీ కొలిక్కిరాని అంశంగా మారింది. ఒకవైపు సీనియర్‌ నేతలు అసహనం వెళ్లగక్కడంతో వారు పార్టీ మారుతారని తరచూ ప్రచారం జరుగుతోంది. ఈ విషయం పార్టీ క్యాడర్‌ను సైతం అయోమయానికి గురిచేస్తోంది. మాజీ ఎంపీ వివేక్‌, విజయశాంతి, రాజగోపాల్‌రెడ్డి, విశ్వేశ్వర్‌రెడ్డి సహా మరికొందరు మాజీ ప్రజాప్రతినిధులు పార్టీని వీడనున్నారని విశ్వసనీయంగా తెలిసింది. అయితే ఇటీవల సోషల్‌ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం కావడంతో పార్టీలోనే ఉంటామని పలువురు నేతలు పదేపదే నొక్కిచెప్పినప్పటికీ ఇంకొన్ని రోజుల పరిణామాల అనంతరం కచ్చితమైన నిర్ణయానికొస్తారని వారి అనుచరులు భావిస్తుండటం గమనార్హం.