కాల్డేటాపై హైకోర్డు స్టే
హైదరాబాద్,జులై30(జనంసాక్షి):
ఏపీ సీఐడీ కోరిన కాల్ డేటా ఇవ్వాలంటూ విజయవాడ కోర్టు టెలికం సర్వీస్ ప్రొవైడర్లకు ఇచ్చిన ఆదేశాలపై హైదరాబాద్ హైకోర్టు స్టే విధించింది. సర్వీస్ ప్రొవైడర్లు కాల్ డేటాను విజయవాడ కోర్టుకు సీల్డ్ కవర్ లో సమర్పించాలని, దాన్ని ప్రత్యేక మెసెంజర్ ద్వారా హైకోర్టు రిజిస్ట్రార్ కు పంపించాలని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలపాటు వాయిదా వేసింది. కాల్ డేటా ఇవ్వాలని ఆదేశించే అధికారం విజయవాడ కోర్టుకు లేదని తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది రాంజెఠ్మలాని వాదించారు.
ఓటుకు కోట్లు వ్యవహారం బయటికి రావడం, అందులో ఏపీ సీఎం చంద్రబాబు ప్రమేయంపై ఆధారాలు ఉండటంతో ఆయన ఎదురుదాడికి దిగారు. ఏపీ సీఎం, మంత్రులు, ఇతర ముఖ్య నేతల ఫోన్లను తెలంగాణ ప్రభుత్వం ట్యాప్ చేయించిందని ఆరోపిస్తూ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు.