కాళేశ్వరంతో రైతాంగానికి వరం

గోదావరి జలాలతో పొలాలకు కళ

జనగామ,నవంబర్‌25 (జనంసాక్షి) : కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్ర రైతాంగానికి ఒక వరమని మాజీ మంత్రి,ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. దేశంలోనే అత్యుత్తమ ప్రాజెక్టుగా కాళేశ్వరం గుర్తింపు పొందిందనానరు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతాంగాన్ని వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ వ్యవసాయాన్ని పండుగ చేశారన్నారు. రైతులు పండించిన పంటకు అత్యధిక గిట్టుబాటు ధర అందించడమే లక్ష్యంగాపనిచేస్తున్నారన్నారు. అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంవూతిగా కేసీఆర్‌ పేరు తెచ్చుకున్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దేశంలోనే ప్రజలకు అత్యుత్తమ పాలన అందిస్తున్నారని అన్నారు. ఇందుకు నిదర్శనం ఇటీవల జరిగిన హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఘనవిజయం సాధించడమేనన్నారు. రాబోవు మున్సిపల్‌ ఎన్నికల్లో కూడా ప్రతిచోట టీఆర్‌ఎస్‌ జెండా ఎగరడం ఖాయమన్నారు. కార్మికులకు, కర్షకులకు రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో లబ్ది చేకూరిందన్నారు. ఇటీవల చేపట్టిన 30రోజుల ప్రణాళిక కార్యక్రమంలో అందరూ పార్టీలకతీతంగా పాల్గొని గ్రామాలను బాగు చేసుకుంటున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రతిపక్షాలు విమర్శనాత్మక విమర్శలు మరిచి అనవసర రాద్దాంతాలు చేసి అపహాస్యం పాలవుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌ రైతుల పక్షపాతి అని.. ఇందుకోసం అన్నదాతలకు నిరంతర విద్యుత్‌తో పండుగలా వ్యవసాయం చేసేలా అహర్నిశలు పాటుపడుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. గోదావరి జలాలను జనగామ తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతున్నదన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు చూసే ప్రజలు రానున్న మున్సిపల్‌ ఎన్నికల్లో ఆశీర్వదిస్తారన్నారు. సీఎం కేసీఆర్‌ హయాంలోనే పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభిస్తున్నదని, రైతులు దళారీలను ఆశ్రయించి మోసపోవద్దని సూచించారు.