కువైట్‌కు భారతీయ విమానాలకు అనుమతి


కువైట్‌ కేబినేట్‌ నిర్ణయంతో 22నుంచి రాకపోకలు
న్యూఢల్లీి,ఆగస్ట్‌19(జనం సాక్షి): కువైట్‌లోకి భారత్‌ నుంచి విమానాలు నేరుగా ప్రవేశించేందుకు ఆ దేశం అనుమతి ఇచ్చింది. ఈ నెల 22 నుంచి ప్రవేశం కల్పించాలని కువైట్‌ కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నది. అయితే, కువైట్‌ ఆమోదించిన వ్యాక్సిన్‌ తీసుకున్న పౌరులకు మాత్రమే ప్రవేశం కల్పించనున్నట్లు స్పష్టం చేసింది. కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో గతేడాది మార్చి నుంచి భారతీయులు నేరుగా కువైట్‌లోకి ప్రవేశించకుండా నిషేధం విధించారు. తాజా నిర్ణయంతో భారత్‌, పాక్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, నేపాల్‌, ఈజిప్ట్‌ నుంచి నేరుగా కువైట్‌కు నేరుగా వెళ్లొచ్చు. కువైట్‌ ్గªజైర్‌, ఆక్స్‌ఫర్డ్‌ ఆస్టాజ్రెనెకా, మోడెర్నా, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వ్యాక్సిన్లను ఆమోదించింది. ఆయా టీకాలు తీసుకున్న వారికే అనుమతి ఇవ్వనుంది. సినోఫామ్‌, స్పుత్నిక్‌ సహా అనధికార టీకాలు పొందినవారు తప్పనిసరిగా మూడో మోతాదుగా కువైట్‌ ఆమోదించిన వ్యాక్సిన్‌ను పొందాలి. కువైట్‌ నుంచి వ్యాక్సిన్‌ తీసుకున్న వారు విమానాశ్రయానికి వచ్చిన తర్వాత ఇమ్యూన్‌, కువైట్‌ మొబైల్‌ ఐడీని యాప్‌లలో చూపాలి. కువైట్‌ వెలుపల టీకా తీసుకున్న వారు పాస్‌పోర్ట్‌, టీకా సర్టిఫికెట్‌ తదితర సమాచారంతో కువైట్‌ ఆరోగ్యమంత్రిత్వ శాఖ నుంచి అనుమతి తీసుకోవాలి. అలాగే ప్రయాణానికి ముందు తప్పనిసరిగా 72 గంటల్లోపు తీసుకున్న ఆర్‌టీ పీసీర్‌ నెగెటివ్‌ సర్టిఫికెట్‌ సైతం తప్పనిసరిగా చేసింది. అలాగే కువైట్‌కు చేరిన తర్వాత తప్పనిసరిగా ఏడు రోజులు క్వారంటైన్‌లో ఉండాలని చెప్పింది.