కూటమికి ఓటేస్తే చీకట్లు తప్పవు

ప్రచారంలో పద్మాదేవేందర్‌ హెచ్చరిక

మెదక్‌,నవంబర్‌10(జ‌నంసాక్షి): అరవై ఏళ్లపాటు పాలించి అన్ని రంగాలలో తెలంగాణ అభివృద్ధిని నాశనం చేస్తే గత నాలుగున్నరేళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ బంగారు తెలంగాణ నిర్మాణం చేస్తుంటే తట్టుకోలేని ప్రతిపక్షాలు ఏకమై మహాకూటమి అంటూ వస్తున్నారని మాజీ డిప్యూటి స్పీకర్‌ పద్మాదేవేందర్‌ రెడ్డి అన్నారు. వీరంతా చంద్రబాఉ నేతృత్వంలో ఏకమై ఎన్నికలు రాగానే వస్తున్నారన్నారు. ఒకవేళ వారికి ఓటు వేస్తే మళ్లీ చీకటి రోజులు వస్తాయని హెచ్చరించారు. ఇప్పుడు ఇస్తున్న 24 గంటల కరెంట్‌ బంద్‌ అవుఉతందని హెచ్చరించారు. కరెంటు ఆంధ్రాకే వెళ్తుందని, నిధులు అక్కడికే పోతాయన్నారు. అభివృద్ధి సంక్షేమాలను జోడెద్దులా ముందుకు తీసుకువెళ్తున్న టీఆర్‌ఎస్‌ను అదరించి కారు గుర్తుకు ఓటు వేయాలని అన్నారు. ఆమె వివిధ గ్రామాల్లో ప్రచారం చేపట్టారు. తెలంగాణ వ్యాప్తంగా అందరి నోట… అభివృద్ధి మాట వినిపిస్తుందన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు కోరుకున్న అభివృద్ధిని కొనసాగిస్తానని హావిూ ఇచ్చారు.రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వమే తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష అని అన్నారు. 2014కు ముందు జరిగిన అన్ని ఎన్నికల్లో ఏ పార్టీ వారు ఎలాంటి హావిూలు ఇచ్చారు, ఎంత వరకు నెరవేర్చారో తెలియంది కాదన్నారు. ప్రతి ప్లలెల్లో అభివృద్ధి టీఆర్‌ఎస్‌కు జై కొడుతున్నారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణలో 24 గంటలు కరెంట్‌ రైతన్నలకు అందించి వారికి కష్టాలు లేకుండా చేసిందన్నారు. అలాగే రైతు కుటుంబాలు కుటుంబ పెద్ద మరణిస్తే రైతుబీమా ప్రవేశపెట్టి రైతన్నలకు సీఎం కేసీఆర్‌ పెద్దన్నగా నిలిచాడన్నారు. మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించడానికి సీఎం కేసీఆర్‌ తీవ్రంగా కృషి చేస్తున్నారు. కాళేశ్వరం ద్వారా మేడిగడ్డ, సుంబిల్ల, అన్నారం, మిడ్‌మానేరు, సిద్దిపేట, మల్లన్నసాగర్‌, కొండపోచమ్మపల్లి, రామాయంపేటలకు నీళ్లందించడం ఖాయమన్నారు. తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం కావాలంటే టీఆర్‌ఎస్‌ని భారీ మెజార్టీతో గెలిపించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. డిసెంబర్‌ 11న ఏ మహాకూటమి కనిపించదని అప్పుడు కనిపించేది కేవలం టీఆర్‌ఎస్‌ మాత్రమేనని ఆమె జోష్యం చెప్పారు. తిరిగి ప్రభుత్వం అధికారంలోకి రాగానే డబుల్‌ బెడ్‌రూంలు ప్రభుత్వం నిర్ణయించిన చోటే కాకుండా సొంత స్థలాల్లో కూడా కట్టిస్తుందని ఆమె పేర్కొన్నారు.