కొత్తగూడెం రైల్వేస్టేషన్‌ సమీపంలో నాటుబాంబుల కలకలం

` వీధి కుక్క కొరకడంతో పేలుడు..శునకం మృతి
` చెత్తకుప్పలో మరో 4 నాటుబాంబులు గుర్తింపు
భద్రాద్రికొత్తగూడెం(జనంసాక్షి): కొత్తగూడెం రైల్వేస్టేషన్‌లో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. గురువారం ఉదయం ఆగంతకుడు స్థానిక రైల్వేస్టేషన్‌ మొదటి ప్లాట్‌ ఫారంపై నల్ల సంచి ఉంచి వెళ్లిపోయాడు. అందులో ఏముందో ఎవరు పట్టించుకోలేదు. ఆ సంచిని వీధి కుక్క రైల్వే ట్రాక్‌పైకి నోటితో లాక్కెళ్లింది. ఆ సంచిలో ఉల్లిగడ్డ ఆకారంలో ఉన్న బాంబును కుక్క కొరింది. దీంతో భారీ శబ్దంతో బాంబు పేలుడు సంభవించింది. కుక్క అక్కడికక్కడే మృతి చెందింది. ఈ బాంబు పేలుడుతో రైల్వే స్టేషన్‌లోని ప్రయాణికులు పరుగులు తీశారు. స్థానికుల సమాచారంతో.. కొత్తగూడెం 3వ పట్టణ పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంకా ఏమైనా బాంబులు ఉన్నాయా అంటూ పోలీస్‌ జాగిలాలతో రైల్వే స్టేషన్‌లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా సవిూపంలోని సీసీ కెమెరా ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు. రైల్వే స్టేషన్‌లో ఆగంతకుడు ఎటువైపు నుంచి వచ్చాడు. ఎటువెళ్లాడనే కోణంలో పోలీసులు పరిశీలిస్తున్నారు.