కోదండరామ్‌ పార్టీని బొందపెట్టిన కాంగ్రెస్‌ …!

కూటమి కట్టామంటూనే కాంగ్రెస్‌ సీట్ల పంపకాల్లో తనైదన రాజకీయం ప్రదర్శించింది. రెండున్నరనెలలుగా సాగదీసి చివరకు సొంత పార్టీ వారికి, కూటమి మిత్రులకు వెన్నుపోటు పొడిచింది. సొంతపార్టీకి చెందిన పలవురు నాలుగేళ్లుగా పార్టీకోసం పనిచేస్తున్నా వారికి టిక్కెట్లు దక్కలేదు. మర్రిశశిధర్‌ రెడ్డి, బోడ జనార్దన్‌ రెడ్డి, చివరకు బిసి కార్డుతో పొన్నాలకు టిక్కెట్‌ ఇచ్చినా ఆయనకూ కాంగ్రెస్‌ వెన్నుపోటు పొడవాలని చూసింది. రాజకీయంగా ఇలాంటి వెన్నుపోట్లు రేపురేపు మరిన్ని ఉంటాయి. మొత్తంగా తెలంగాణలో కోదండరామ్‌ పార్టీ ఎదగకుండా చూసుకుంది. మరో ప్రాంతీయ పార్టీకి అవకాశం లేకుండా నిరదోధించ గలిగింది. అలాగని సిపిఐని సిపిఎం గుప్పిట్లోకి వెళ్లకుండా చేయగలిగిన చాతుర్యం కాంగ్రెస్‌ ప్రదర్శించింది.

తమకు పోటీగా ఉంటారను కున్న వారికి టిక్కెట్లు రాకుండా వెన్నుపోటు పొడవడం కాంగ్రెస్‌కు వెన్నతో పెట్టిన విద్య. అలాగే కూటమి పేరుతో ఓట్లను కొల్లగొట్టే కార్యక్రమంలో భాగంగా భాగస్వామ్య సిపిఐ, తెలంగాణ జనసమితికి కూడా వెన్నుపోటు పొడిచింది. జనగామ విూకేనంటూ ప్రకటించి పొన్నాలను పక్కన పెట్టే ప్రయత్నం చేశారు. అలాగే బిసి కార్డును ప్రయోగించి మళ్లీ కోదండరామ్‌నే బలిపశువు చేశారు. జనగామలో కోదడంరామ్‌ పోటీ చేయకుండా తెలివిగా పొన్నాలకు సీటు వచ్చేలా కోదండరామ్‌తోనే మమ అనిపించారు. రాజకీయ శాస్త్రంలో ఇలాంటి పాఠాలు చెప్పని ప్రొఫెసర్‌ సార్‌కు ఇలాంటి అనుభావలు కొత్త కావడం వల్ల సర్దుకు పోయారు. మరోవైపు సీట్ల సర్దుబాటుపై సుదీర్ఘంగా కసరత్తు చేసిన కాంగ్రెస్‌ ,మహా కూటమి నaేతలను చివరకు బోల్తా కొట్టించారు. అంగీకారం మేరకు ఇచ్చిన సీట్లలో మళ్లీ బి ఫారాలు ఇచ్చి తనదైన రాజకీయం కాంగ్రెస్‌ నెరపింది. అంతెందుకు మిర్యాలగూడను తెలంగాణ జనసమితికి ఇచ్చి అక్కడ బిసి నేత కృష్ణయ్యకు బి.ఫామ్‌ ఇచ్చింది. ఇదంతా ఓ రాజకీయ ఎత్తుగాడగానే చూడాలి. కూటమి కట్టి ఓట్లు రాబట్టుకునే యత్నం తప్ప మిత్రులకు సీట్లు ఇవ్వాలన ఇంగితం లేని కాంగ్రెస్‌తో జతకట్టినందుకు సిపిఐ. తెలంగాణ జనసమితిలు తలనొప్పి తెచ్చుకోక తప్పదు. కూటమిలోని ఇతర పార్టీలకు 25 స్థానాలు కేటాయించాలని తొలుత కాంగ్రెస్‌ నిర్ణయించింది. ఇందులో 11 స్థానాల్లో కాంగ్రెస్‌, తెలంగాణ జన సమితి తమ అభ్యర్థులకు బీ ఫారాలు ఇచ్చి నామినేషన్‌ వేయించడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. తెలుగుదేశం, సీపీఐకి కేటాయించిన స్థానాల్లో కాంగ్రెస్‌ ఎవరికీ బీ ఫారాలు ఇవ్వలేదు. అయితే అక్కడ కాంగ్రెస్‌ తిరుగుబాటు అభ్యర్థులు బరిలోకి దిగారు. కాంగ్రెస్‌, తెజస మధ్య మాత్రం నేరుగా పోటీ నెలకొంది. తెలుగుదేశం పార్టీకి కేటాయించిన మహబూబ్‌నగర్‌ లో కూడా తమ అభ్యర్థికి తెజస బీ ఫారం ఇచ్చింది. నామినేషన్ల ఉపసంహరణ గడువులోగా రెండు పార్టీలు ఓ అంగీకారానికి రాలేకపోతే ప్రజలను గందరగోళంలో పడేయడం ఖాయం. రెండు పార్టీలు అవగాహనకు వచ్చి కొన్నిసీట్లలో పరస్పరం పోటీ చేసుకోవడం, దానికి స్నేహపూర్వక పోటీ అని పేరు పెట్టడం ద్వారా కాంగ్రెస్‌ తాను వేసిన ఎత్తులను అవలంబించింది. ఆర్‌ కృష్ణయ్యకు సీటుకేటాయించడం, బిసి కార్డును ఉపయోగించుకోవడమే తప్ప పోటీ లేనిచోట ఆయనకు టిక్కెట్‌ ఇవ్వలేకపోయారు. ఇలా పరస్పర పోటీ ఉన్న ఈ నియోజకవర్గాల్లో ప్రచారంపై కూడా ఆ ప్రభావం ఉంటుంది. తెజసకు ఎనిమిది సీట్లు కేటాయించా లని కాంగ్రెస్‌ నిర్ణయించింది. అయినా అందులోనూ తమ అభ్యర్థులకు మళ్లీ బి.ఫారాలు ఇచ్చింది. ఇలా మొత్తం 11 నియోజవర్గాల్లో అధికారికంగానే రెండు పార్టీల అభ్యర్థులుండగా, మిగిలిన చోట్ల తిరుగుబాటు అభ్యర్థులున్నారు. కాంగ్రెస్‌ వంచనతీరుకు సీట్ల పంపకాల తీరు అద్దం పడుతోంది. పైగా మన మహా కూటమి చైర్మన్‌ విూరే అంటూ కోదండరామ్‌కు రోజుకోసారి అత్యున్నత మర్యాద ఇచ్చినట్లే ఇచ్చి చివరకు ఆయనను మోసం చేయడానికి

కూడా వెనకాడని గుణాన్ని కాంగ్రెస్‌ ప్రదర్శించింది. చివరకు తను పోటీ చేయాలను కున్న జనగామనైనా దక్కించుకోలేని పరిస్థితిని తెచ్చింది. ఇదిగో అదుగో అంటూ టీజేఎస్‌ను, సీపీఐని కాంగ్రెస్‌ చర్చల్లో ముంచి వారికి సున్నం పెట్టిన తీరు రాజకీయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఉమ్మడి వేదికపై ఘనంగా అభ్యర్థుల్ని ప్రకటిద్దామని ఊరించి, విూకిచ్చే పిడికెడు.. ఇంతే అంటూ అర్ధరాత్రి హఠాత్తుగా కాంగ్రెస్‌ తన అభ్యర్థుల్ని ప్రకటించుకుంది. కోదండ రామ్‌ ఇమేజ్‌ ద్వారా వచ్చే ఓట్లపైనా, సిపిఐ కార్యకర్తల ప్రచారం, ఓట్లపైనా కన్నేసిన కాంగ్రెస్‌ తెలివిగా ఈ రెండు పార్టీలకు శఠగోపం పెట్టిన తీరు రాజకీయాల్లో ఔరా అనిపిస్తోంది. తాను ప్రధాన ప్రత్యామ్నాయంగా ఉన్న తెలంగాణలో మరో ప్రాంతీయ పార్టీని పెంచిపోషించ డానికి ఇష్టపడని కాంగ్రెస్‌ ముఖ్యులు తెలివిగా ఆదిలోనే కోదండరామ్‌ పార్టీకి సమాధి కట్టారు.టిఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయంగా ఎదిగే క్రమంలో మరో ప్రాంతీయ పార్టీ బలపడకుండా జాగ్రత్త పడ్డారు. రాజకీయమంటే కాంగ్రెస్‌ దగ్గరే నేర్చుకోవాలి. కేసీఆర్‌ను గెలవాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా, మిత్రపక్షాలకు సీట్లు దక్కకుండా కాంగ్రెస్‌ వేసిన ఎత్తు భలేగా కుదరింది. కూటమి కట్టేందుకు బలమున్న తెలుగుదేశాన్ని, చంద్రబాబు వల్ల తమకు అంటుకునే తెలంగాణ వ్యతిరేకతను నిరోధించడానికి కోదండ పార్టీ సెంటిమెంటును రాసుకుని,. సీపీఐకున్న ఆర్గనైజ్డ్‌ వోటు బ్యాంక్‌తో కాంగ్రెస్‌ ఆడిన చదరంగం హైలెట్‌గా చెప్పకోవాలి. కెసిఆర్‌ బూచిని చూపి కూటమిలో కొనసాగడం అవసరమన్న రీతిలో సిపిఐ, కాంగ్రెస్‌, టిడిపిలను మంత్రముగ్ధులను చేసి మరీ తన కార్యాన్ని కాంగ్రెస్‌ గట్టెక్కించుకుంది. కాంగ్రెస్‌తో దోస్తీ అంటే అంతిమంగా కాంగ్రెస్‌ తాననుకున్నదే చేస్తుందన్నది రుజువు చేసుకున్నది. దోస్తీలో తనకు లబ్ది చేకూరడమెలా అన్నదే దాని స్కెచ్‌ ఉంటుంది. తొలుత అది మనకు అనుకూలమని భ్రమించేలా చేస్తుంది. అయితే తెలంగాణ ఉద్యమంలో మాత్రం కాంగ్రెస్‌ తోక కత్తిరించి దానిని ఆటాడించిన కెసిఆ/- కాంగ్రెస్‌కు పంగనామాలు పెట్టారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్‌ను టిఆర్‌ఎస్‌లో కలిపేస్తానంటూ నమ్మబలికి కాంగ్రెస్‌ పాఠాన్ని దానికే అప్పగించి దిమ్మదిరిగే రాజకీయం ఒక్క కెసిఆర్‌ మాత్రమే చేయగలిగారు. ఈ విషయంలో కోదండరామ్‌, సిపిఐ నేతలు మాత్రం నివ్వెర పోక తప్పని స్థితిలో కాంగ్రెస్‌ చేసింది.