క్షమించండి.. నీళ్లు ఇవ్వలేం

– సుప్రీం ఆదేశాలపై కర్ణాటక స్పందన
బెంగళూరు, మే4(జ‌నం సాక్షి ) : కావేరీ జలాల విషయంలో తమిళనాడుకు ప్రస్తుతం ఇస్తున్న దానికంటే 4 టీఎంసీలు అదనంగా నీటిని విడుదల చేయాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలపై కర్ణాటక స్పందించింది. తమిళనాడుకు అదనంగా నీరు ఇచ్చే పరిస్థితిలో రాష్ట్రం లేదని పేర్కొంది. ‘క్షమించండి. తమిళనాడుకు నీరు ఇవ్వలేం. ఒకవేళ తమిళనాడుకు నీరు ఇవ్వాలని మాకున్నా.. మా వద్ద అంత నీటి నిల్వ లేదు. కావేరీ బేసిన్‌లోకి నాలుగు కాల్వల నుంచి మొత్తం 9 టీఎంసీల నీరు వస్తోంది. ఆ 9 టీఎంసీలు మాకు తాగడానికి, పొలాలకు సరిపోవడంలేదు. మాకు నీటి కొరత ఉంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలను పాటించలేకపోతున్నాం. ఈ విషయం గురించి సుప్రీంకు వివరణ ఇస్తాం’ అని కర్ణాటక నీటి వనరుల శాఖ మంత్రి ఎంబీ పాటిల్‌ వెల్లడించారు. తమిళనాడులో కావేరీ యాజమాన్య బోర్డు నిర్వహించాలని రాష్ట్రంలో కొంతకాలంగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం మే 4 కల్లా ముసాయిదాను అందించాల్సిందిగా సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. కానీ ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటక ఎన్నికల ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉండడంతో ముసాయిదాను ప్రవేశపెట్టలేకపోయారు. దాంతో ఈ కేసును సుప్రీం మే 8కి వాయిదా వేసింది.