గద్దర్‌పై బండి సంజయ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

` ఆయనకు పద్మ అవార్డు ఎలా ఇస్తాం?
` నక్సలైట్లతో కలసి వందలాది బిజెపి నాయకులను హత్యచేశారు
` కేంద్ర పథకాల పేర్లు మార్చితే ఊరుకోమన్న కేంద్రమంత్రి
కరీంనగర్‌(జనంసాక్షి):ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల విషయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గద్దర్‌కు పద్మ అవార్డు ఎలా ఇస్తామంటూ ఆయనను అవమానించేలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ’పద్మ’ అవార్డుల కోసం జాబితాను పంపేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి పంపాలని, గద్దర్‌కు ఎట్లా పద్మ అవార్డు ఇస్తామని ఆయన ప్రశ్నించారు. ప్రజా యుద్ధ నౌక గద్దర్‌కు పద్మ అవార్డ్‌ ఇవ్వకపోవడంపై తెలంగాణ ప్రభుత్వం చేస్తోన్న విమర్శలకు కేంద్రమంత్రి, బీజేపీ కీలక నేత బండి సంజయ్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఎంతో మంది బీజేపీ కార్యకర్తలను, ఎన్‌ కౌంటర్లలో పోలీసులను పొట్టన బెట్టుకున్న వ్యక్తి గద్దర్‌ అని.. అలాంటి వ్యక్తికి పద్మ అవార్డు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. మావోయిస్టుగా పని చేసి ఎంతో మంది ప్రాణాలు తీసిన వారిలో గద్దర్‌ ఒకరని.. ఆయనకు పద్మ అవార్డు ఇచ్చేదే లేదని కుండబద్దలు కొట్టారు.సోమవారం కరీంనగర్లో బండి సంజయ్‌ విూడియాతో మాట్లాడుతూ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ నక్సలైట్‌ కాదన్నారు. మావోయిస్టు భావజాలం వేరు.. నక్సలైట్‌గా పని చేయడం వేరని పేర్కొన్నారు. నక్సలిజంతో ఎంపీ ఈటల రాజేందర్‌కు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. అలాగే.. నంది అవార్డుల స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలను కుంటున్న గద్దర్‌ అవార్డులు మా వాళ్ళు తీసుకోరని బండి సంజయ్‌ స్పష్టం చేశారు. గద్దర్‌ కాంగ్రెస్‌, టీడీపీకి చెందిన నేతలను హతమార్చారని.. ఆ విషయం సీఎం రేవంత్‌ రెడ్డికి తెల్వదని అన్నారు. గద్దర్‌కు వ్యతిరేకంగా మాట్లాడానని.. నా దిష్టి బొమ్మ తగలబెడితే నా ఆయుష్షే పెరుగుతుందని సెటైర్‌ వేశారు కేంద్రమంత్రి బండి సంజయ్‌. ’గద్దర్‌ ఎంత మంది బీజేపీ కార్యకర్తలను కాల్చి చంపించారో తెలియదా..?’ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. నమ్మిన సిద్దాంతం కోసం ప్రజాస్వామ్య బద్దంగా ఆందోళన చేసిన వందల మంది బీజేపీ కార్యకర్తలను నక్సలైట్లతో కలిసి హత్య చేయించిన వ్యక్తి గద్దర్‌ అని బండి సంజయ్‌ ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ సెంటిమెంట్‌తో ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తోందని, తెలంగాణ సెంటిమెంట్‌తో ఎవరు లాభపడ్డారో.. ఎవరు బలైపోయారో ప్రజలందరికీ అర్థమైందని అన్నారు. ఇటీవల కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డుల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని సీఎం రేవంత్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాము గోరటి వెంకన్న, గద్దర్‌, జయధీర్‌ తిరుమలరావు, చుక్కా రామయ్య, అందెశ్రీ పేర్లు సిఫార్సు చేసినా కేంద్రం పట్టించుకోలేదని రేవంత్‌ విమర్శించారు. ఏపీకి 5 అవార్డులు ఇచ్చారని, తెలంగాణకు నాలుగైనా ఇవ్వాల్సిందని అన్నారు. పద్మ అవార్డుల విషయంలో చూపిన వివక్షపై కేంద్రానికి లేఖ రాస్తానని సీఎం అన్నారు. సీఎం వ్యాఖ్యలపై తాజాగా బండి సంజయ్‌ ఈ హాట్‌ కామెంట్స్‌ చేశారు. పద్మ అవార్డులు అర్హులకే వచ్చాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మంచి పేర్లు పంపితే కేంద్రం పరిశీలిస్తుందని, ఏ పేరు పడితే ఆ పేరు పంపితే పద్మ అవార్డులు ఇవ్వరని సంజయ్‌ అన్నారు. ’గద్దర్‌కి పద్మ అవార్డు ఎలా ఇస్తాం..? ఆయన భావజాలం ఏంటి..? బరాబర్‌ గద్దర్‌కు ఇవ్వం. ఎందరో బీజేపీ నేతలను చంపిన వ్యక్తుల్లో గద్దర్‌ ఒకరు. పద్మ అవార్డులు స్థాయి ఉన్న వారికే ఇస్తాం. బీజేపీ కార్యకర్తలను, పోలీసులను చంపిన వారికి అవార్డులు ఎలా ఇస్తాం..? అని బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు.
కేంద్ర పథకాల పేర్లు మార్చితే ఊరుకోం
మీ పథకాలకు ఏమైనా పేర్లు పెట్టుకోండి.. కానీ కేంద్ర పథకాలకు పేర్లు మార్చితే ఊరుకోమని కేంద్ర మంత్రి బండిసంజయ్‌ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర సంక్షేమ పథకాల పేర్లను మార్చితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన, గరీబ్‌ కళ్యాణ్‌ యోజన వంటి పథకాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేకుండా కేంద్రమే నేరుగా ప్రజలకే అందిస్తుందన్నారు. పరిస్థితి అంత వరకు తీసుకురావొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు. సంక్షేమ పథకాల అమలు విషయంలో పేదలకు ఎట్టి పరిస్థితిల్లోనూ తాము అన్యాయం చేయబోమని స్పష్టం చేశారు. ప్రజలందరికీ ఉచితంగా బియ్యం కేంద్రమే ఇస్తోంది కదా… గరీబ్‌ కళ్యాణ్‌ యోజన అని పేరు పెడితే తప్పేంది? ప్రధాని ఫోటో ఎందుకు పెట్టరు అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఖర్చయ్యే సంక్షేమ పథకాలకు ఎవరి పేరు పెట్టుకున్నా తమకు అభ్యంతరం లేదని.. కాంగ్రెస్‌కు నచ్చితే ఒసామా బిన్‌ లాడెన్‌, దావూద్‌ ఇబ్రహీం పేర్లు పెట్టుకున్నా అభ్యంతరం లేదంటూ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. అభివృద్ధి విషయంలో కేంద్రం పూర్తిగా సహకరిస్తోందన్నారు. గత 10 ఏళ్లలో రూ.12 లక్షల కోట్లకుపైగా కేంద్రం ఖర్చు చేసిందని తెలిపారు. గ్రామాల్లో జరిగిన అభివృద్ధి అంతా కేంద్ర నిధులతోనే అని స్పష్టం చేశారు. రైతు భరోసా, కమ్యూనిటీ హాల్‌, స్మశాన వాటిక, వీధి దీపాలు, రోడ్ల పైసలన్నీ కేంద్ర ప్రభుత్వానివే అని చెప్పుకొచ్చారు. ఆరు గ్యారంటీలపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేనేలేదన్నారు. ‘‘మండలానికి ఒక గ్రామంలోనే నాలుగు పథకాలకు ఎంపిక చేసి లబ్ది చేయడమేంది? మిగిలిన గ్రామాల ప్రజలు కాంగ్రెస్‌కు ఓట్లేయలేదా? రాష్ట్ర ప్రజలకు ఇంత దుర్మార్గంగా చీటింగ్‌ చేస్తారా? రాష్ట్ర ప్రజలందరికీ లబ్ది చేకూరుస్తామని చెప్పి మండలానికి ఒక గ్రామానికి లబ్ది చేకూర్చడం నీచం. కాంగ్రెస్‌ నేతల జేబుల నుంచి రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ఖర్చు చేస్తున్నారా? లేక పాకిస్తాన్‌..బంగ్లాదేశ్‌ నుంచి తెచ్చి ఖర్చు చేస్తున్నారా? ప్రజలు కట్టిన పన్నులతోనే కేంద్రమైనా, రాష్ట్రమైనా ఖర్చు చేస్తోంది కదా? గతంలో పీఎం ఆవాస్‌ యోజన పేరుతో 2 లక్షల 40 వేల ఇండ్లను కేంద్రం మంజూరు చేస్తే… కేసీఆర్‌ ఒక్క ఇల్లు కట్టకుండా ప్రజలను రోడ్డున పడేసింది నిజం కాదా? డబుల్‌ బెడ్రూం ఇండ్ల పేరుతో ప్రజలను మభ్యపెట్టి మోసం చేసింది నిజం కాదా?’’ అంటూ ప్రశ్నలు కురిపించారు. పద్మ అవార్డుల జాబితాను పంపేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి పంపాలని హితవుపలికారు. గద్దర్‌కు ఎట్లా పద్మ అవార్డులిస్తామని ప్రశ్నించారు. ఎంత మంది బీజేపీ కార్యకర్తలను మట్టు పెట్టారో తెలియదా అని అన్నారు. వందల మంది బీజేపీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేస్తే… నక్సలైట్లతో కలిసి హత్య చేయించిన వ్యక్తి గద్దర్‌ అంటూ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సెంటిమెంట్‌తో ఎవరు లాభపడ్డారో… ఎవరు బలైపోయారో ప్రజలందరికీ అర్ధమైందని కేంద్రమంత్రి బండి సంజయ్‌ పేర్కొన్నారు.